కరోనా వ్యాప్తిని నియంత్రణకు 21రోజుల లాక్ డౌన్ నేపథ్యంలో పేద ప్రజలు, కూలి పని చేసుకునేవారిని ఆదుకునేందుకు తీసుకుంటున్న చర్యలపై ఈ నెల 9లోపు మధ్యంతర నివేదిక ఇవ్వాలని కెసిఆర్ సర్కారుకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పేదలను, కార్మికులను ఆదుకోవాలని, డాక్టర్ లు, సిబ్బంది కరోనా బారిన పడకుండా రక్షణ కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, టీజేఎస్ నేత ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్ రావు ఈ నెల 3న దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు. కరోనా బాధితులకు ట్రీట్మెంట్ అందిస్తున్న డాక్టర్లకూ వైరస్ సోకిందని, రాష్ట్రంలోని వైద్య సిబ్బందికి మాస్కులు, డ్రెస్ కోడ్ ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోర్టుకు తెలిపారు.
హైదరాబాద్తో పాటు ప్రధాన పట్టణాల్లో ఉన్న వారి ఇంటి వద్దకువెళ్లి కరోనా పరీక్షలు జరిపేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విన్నవించారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్–1897 ప్రకారం ఇంటికే వస్తువులు సరఫరా చేయాలని, పేదలు, అసంఘటిత కార్మికులకు షెల్టర్ ఏర్పాటు చేయడంతోపాటు ఫ్రీ మీల్స్ అందించాలని పిటిషనర్ వాదించారు. దీనిపై ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ స్పందిస్తూ.. కేంద్రం ఆదేశాల మేరకు కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై ఏప్రిల్ 9న మధ్యంతర నివేదిక సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తుది నివేదిక ఏప్రిల్ 15 వరకు సమర్పించాలని, విచారణను ఏప్రిల్ 9కి వాయిదా వేసింది.