bihar elections
దేశంలోని ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా.. కాంగ్రెస్ పార్టీ తీరే వేరు. ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ అయినా పార్టీ అభ్యర్థులను ప్రకటించడంలో అదే నిర్లక్ష్యం. మిగతా పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారాల్లో మునిగిపోతుంటే ఆ పార్టీ మాత్రం అభ్యర్థుల కోసం వేట సాగిస్తుంటుంది. పోనీ.. రాష్ట్ర నాయకత్వాల నుంచి ఫైనల్ చేసిన అభ్యర్థులను ఓకే చేసేందుకు కూడా దేశ నాయకత్వం తాత్సారం చేస్తూనే ఉంటుంది. నామినేషన్ల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంటుండగా నెమ్మదిగా అభ్యర్థులను ప్రకటించి నామినేషన్లు వేయిస్తారు. ఇప్పుడు బిహార్ ఎలక్షన్లలోనూ అదే కనిపిస్తోంది.
Also Read: నిరుద్యోగులకు ప్రధాని మోదీ శుభవార్త..?
బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు అక్కడి పార్టీలు అన్నివిధాలా రెడీ అయిపోయాయి. ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా షెడ్యూల్ను ప్రకటించడంతో వేడి మొదలైంది. వ్యూహ ప్రతివ్యూహాలు.. ఎత్తులు పైఎత్తులు వేసేందుకు పార్టీలు సిద్ధమయ్యాయి. బిహార్లో బలంగా ఉన్న జనతాదళ్ (యునైటెడ్) కూటమిని దెబ్బతీయడానికి ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్ సారథ్యంలోని కూటమి పావులు కదుపుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సారి అసెంబ్లీలో పాగా వేయాలనే లక్ష్యంతో ఆర్జేడీ కూటమి నేతలు ఎన్నికల ప్రణాళికలను రూపొందిస్తున్నారు.
రాజకీయాల్లో ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కోవాలంటే దానికి తగిన ప్రణాళికలు ఉండాలి. దాన్ని పక్కాగా ఎగ్జిక్యూట్ చేయగలగాలి. ఏ పార్టీతో కలుపుకొని పోవాలి.. ఏ పార్టీతో ఎలా నడుచుకోవాలో కూడా తెలిసుండాలి. బిహార్లో ఇప్పుడు ఆర్జేడీ కూటమి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. జేడీయూ కూటమిని ఎదుర్కోవడంతో ఆర్జేడీ మల్లగుల్లాలు పడుతోంది.
జనతాదళ్ రాష్ట్రీయ లోక్సమతా పార్టీ కాంగ్రెస్ కూటమిలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. బిహార్ రాజకీయాల్లో తలపండిన మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సీబీఐ కేసులతో తెరమరుగైన తరువాత.. ఆ స్థాయి నాయకుడు కనిపించట్లేదు. ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై అభ్యంతరాలూ వ్యక్తమౌతున్నాయి. తేజస్వి యాదవ్ను తమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి రాష్ట్రీయ లోక్సమతా పార్టీ అంగీకరించట్లేదు. తేజస్వి అభ్యర్థిత్వానికి తాము మద్దతు ఇవ్వబోమనీ చెబుతున్నారు. రాష్ట్రీయ జనతాదళ్ నేతలు మాత్రం తేజస్వి యాదవ్ అభ్యర్థిత్వాన్ని ఖాయం చేశాయి. ఈ కూటమి నేతగా ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకోబోతున్నాయి. ఎన్నికల్లో విజయం సాధిస్తే ఆయనే ముఖ్యమంత్రిగా పగ్గాలను అందుకుంటారనే సంకేతాలను ఆర్జేడీ నాయకులు ఇప్పటికే పంపించారు. తేజస్వి అభ్యర్థిత్వంపై కాంగ్రెస్కు పెద్దగా అభ్యంతరాలు లేకున్నా రాష్ట్రీయ లోక్సమతా పార్టీ నేతలు ఆయనకు మద్దతు ఇవ్వడానికి వెనుకాడుతున్నారు. ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది.
Also Read: సంచలనం: కేంద్రంపై కేసీఆర్ న్యాయపోరాటం?
ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ముందుగా ప్రకటించకుండానే ఎన్నికల బరిలో దిగే అవకాశాలు కూడా లేకపోలేదని బిహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శక్తిసింగ్ గోహిల్ తెలిపారు. కూటమిలోని ప్రతి పార్టీకీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే హక్కు ఉందని, దాన్ని ఎవరూ కాదనలేరని చెప్పారు. తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై తమకు ఏ మాత్రం అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. 2015 ఎన్నికల్లో తాము మెరుగైన ఫలితాలను సాధించామని, ఈ సారి తమ ఓటుబ్యాంకును మరింత మెరుగుపర్చుకుంటామని చెప్పుకొచ్చారు. ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అంటున్నట్లుగా సీఎం అభ్యర్థిత్వాన్ని ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్తారా..? లేదా తేజస్వి అభ్యర్థిత్వాన్ని ఆమోదిస్తారా..? చూడాలి మరి.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Discussion in congress for cm candidat in bihar
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com