రాష్ర్టవిభజన తరువాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయింది. ఇన్నాళ్లు రాష్ర్టంలో పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. దీంతో ప్రస్తుతం పార్టీ ప్రతిష్ట ఇనుమడింపజేసే పనిలో నేతలు పడ్డారు. రాష్ర్టంలో జరుగుతున్న పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా ఏపీకి చెందిన నేతలు రాహుల్ గాంధీతో చర్చలు జరుపుతున్నారు.
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రారావు, చింతా మోహన్, జేడీ శీలం, మాజీ కేంద్ర మంత్రి పళ్లం రాజు తదితరులు బుధవారం రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లి కలిశారు. రాష్ర్టంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టాలని సూచించినట్లు తెలిసింది.
అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేయడంతో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని పేర్కొన్నారు. చింతామోహన్ కొత్త రాజకీయ చర్చకు తెరలేపారు. రాష్ర్టంలో పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు.
అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు. రాజకీయాలకు కొంత కాలంగా దూరంగా ఉన్న అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మళ్లీ తిరిగి రాజకీయాల్లో చురుకుగా కావడంతో ప్రచారం జోరందుకుంటోంది. ఈ నేపథ్యంలో తనను కలవాలని రఘువీరాకు రాహుల్ గాంధీ వర్తమానం పంపినట్లు తెలుస్తోంది.
అయితే రఘువీరారెడ్డి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇటీవల తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నీలకంఠాపురం వెళ్లి రఘువీరారెడ్డిని కలిశారు. పార్టీలకతీతంగా రాయలసీమ హక్కుల కోసం పోరాడతామని చెప్పారు. కానీ రఘువీరా మాత్రం తన నిర్ణయం వెల్లడించలేదు. ప్రాంతీయ పార్టీలు బలంగా పాతుకుపోతున్న వేళ కాంగ్రెస్ పార్టీ తిరిగి ఆంధ్రప్రదేశ్ లో ఏ మేరకు పుంజుకుంటుందో చూడాల్సిందే.
Raghava Rao Gara is an Editor, He is Working from Past 2 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read More