Congress candidate for Huzurabad Elections: హుజురాబాద్ (Huzurabad)లో కాంగ్రెస్ (Congress) అభ్యర్థి ఎంపిక పూర్తి కాలేదు. బలమైన అభ్యర్థి వేటలో పడి ఇన్నాళ్లు ఆగినట్లు తెలుస్తోంది. ఎన్నికల కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ సైతం అభ్యర్థి కోసం పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా అభ్యర్థి కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలను ఢీకొట్టే బలమైన నేత కోసం అన్వేషిస్తున్నారు. దీంతోనే కొండా సురేఖ (Konda Surekha)అభ్యర్థిత్వంపై అందరు ఉత్సాహం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ వ్యవహారా ల ఇన్ చార్జి మాణికం ఠాగూర్ సైతం అభ్యర్థి విషయంలో ప్రత్యే చొరవ తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
బీసీ వర్గాల్లో పలుకుబడి ఉన్న సురేఖను తీసుకొచ్చి నిలబెట్టాలని పార్టీ యోచిస్తోంది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంతవరకు అభ్యర్తి ప్రకటన కూడా చేయలేదు. దీంతో అందరిలో ఆసక్తి నెలకొంది. దీంతో హుజురాబాద్ అభ్యర్థిగా కొండా సురేఖ పేరును ప్రతిపాదించాలని అధిష్టానం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ముందే ప్రకటన చేస్తే వివాదాలొస్తాయని భావించి ఆలస్యం చేస్తున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దళిత, గిరిజన దండోరా పేరుతో బహిరంగసభలు నిర్వహిస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో జోష్ కూడా పెరుగుతోంది. సెప్టెంబర్ 17న వరంగల్ లో నిర్వహించే దళిత, గిరిజన దండోరా బహిరంగసభలో సురేఖ అభ్యర్థిత్వం ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంతవరకు హుజురాబాద్ లో కాంగ్రెస్ ప్రచారం కూడా నిర్వహించలేదు. ఈలోపు ఎన్నికల షెడ్యూల్ వస్తే పరిస్థితి ఏంటని నేతల్లో అనుమానాలు వస్తున్నాయి.
బీసీ వర్గాల నేతలే ఉండడంతో కాంగ్రెస్ కూడా అదే వర్గం నుంచి రావాలని చూస్తున్నారు. అయితే కొండా సురేఖ అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ పార్టీలోని కొందరు వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఉత్సాహం సన్నగిల్లుతోంది. పార్టీలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో నేతలు ముందుగా అభ్యర్థి ప్రకటనపై నిర్ణయం తీసుకుని తొందరగా ప్రకటించాలని భావిస్తున్నారు. దీనికి అధిష్టానం నుంచి సరైన సంకేతాలు వచ్చేలా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నా ఇంకా ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని షరతుల నేపథ్యంలో సురేఖ తన నిర్ణయం తెలియజేసినట్లు తెలుస్తోంది.