స్పీకర్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు డిమాండ్ చేశారు. సాక్షాత్తు స్పీకర్ ఇంతటి వ్యాఖ్యలు చేశారంటే పరిస్థితి ఎంత ఘోరంగో ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు. అక్రమ మద్యం అమ్మకాలు జరిపిన వైకాపా నాయకులపై చర్యలు తీసుకోవాలని, ఎక్సైజ్ శాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ ప్రజలకు క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలన్నారు. ప్రజలకు అవసరమైన పాలు, నీళ్లు దిరకడం కష్టమైంది గాని మద్యం మాత్రం వాలెంటీర్ల ద్వారా డోర్ డెలివరీ చేస్తున్నారని విమర్శించారు.
మద్యం దుకాణాలు ఖాళీ అవుతుంటే కేసులు పెట్టకుండా జరిమానాలతో సరిపెడుతున్నారని, మద్యం అమ్మకాలు వైకాపా నాయకుల ప్రధాన ఆదాయ వనరుగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం దుశ్చర్యలకు అత్యవసర సేవలు అంధించే వారు బలవుతున్నారని చెప్పారు.
దేశ వ్యాప్తంగా ముఖ్యమంత్రులు కరోనాను ఏ విధంగా తగ్గించి తమ ప్రజలను ఎలా కాపాడుకోవాలని చూస్తుంటే ఏపీలో జగన్ మాత్రం తుగ్లక్ చర్యలతో రాజకీయం, దోచుకోవడం, దాచుకోవడం వంటి వాటి కోసం తహతహలాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రులు తమ ప్రజల కోసం గ్రౌండ్ లెవల్ లో పని చేస్తూ తమ ప్రజలకు ధైర్యాన్ని అందిస్తుంటే జగన్ మాత్రం తాడేపల్లికే పరిమితం అయ్యి పబ్జి ఆడుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల్లో 30 శాతం మంది అధికారులు, డాక్టర్లలతో పాటు అత్యవసర సేవలు అందిస్తున్న వారే ఉండటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి తార్కాణమని అన్నారు. సదుపాయాలు కల్పించమని ప్రశ్నిస్తున్న డాక్టర్లను, అధికారులను సస్పెండ్ చేశారు. నేడు సదుపాయాలు లేక వైరస్ బారిన పడుతున్నందుకు జగన్ ప్రభుత్వాన్ని సస్పెండ్ చేయాలా అని ప్రశ్నించారు.
డాక్టర్లు, పోలీసులు, అధికారులు, పారశుద్ధ్య కార్మికులకు కనీస సదుపాయాలు కల్పించక వారి ప్రాణాలతో వైకాపా ప్రభుత్వం ఆటలాడుతూ రాజకీయం చేయడం దౌర్బాగ్యమన్నారు.
లాక్ డౌన్ కారణంగా విపత్కర పరిస్తితులు ఎదోర్కొంటూ కూటికోసం, కూలికోసం రోడ్డున పడినవారి కష్టాలు తీర్చేందుకు జగన్ ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు చేయలేదన్నారు. పట్టింపులు, పంతాలను పక్కన పెట్టి అన్యా క్యాంటీన్లను తెరిచి అభాగ్యుల ఆకలి తీర్చే భాద్యత ప్రభుత్వం చేపట్టాలని కోరారు. జగన్ కు ముందు చూపు లేకపోవడంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని చెప్పారు. ప్రతి శుక్రవారం తన అక్రమాస్తుల పై సీబీఐ కోర్టుకు అబద్దాలు చెప్తున్న జగన్ ఇప్పుడు కరోనా పాజిటివ్ కేసులపై బులిటెన్ లో ఒకలా, రిపోర్ట్ లో మరొకలా తప్పుడు లెక్కలు చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. వైకాపా నాయకులకు మితిమీరిన ప్రచార పిచ్చి వలన నేడు రాష్ట్ర వ్యాప్తంగా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని, జగన్ కి, వైసీపీ నేతలకు అబద్ధాలు, అవాస్తవాలు చెప్పటం తప్ప నిజాలు చెప్పటం తెలీదన్నారు.
4 వారాల వరకు రాష్ట్రం లోకి కరోనా వైరస్ రాదని ఎన్నికలు నిర్వహించమని జగన్ సీఎస్ చేత లేఖ రాయించారని, కానీ లేఖ రాసి 4 వారాలు కూడా గడవక ముందే రాష్ట్రంలో 8 వందలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. సిఎస్ లేఖ ప్రకారం ఎన్నికలు నిర్వహించి ఉంటే పరిస్థితి ఏంటిని ప్రశ్నించారు. రాష్ట్రం మారో ఇటలీ అయ్యేదన్నారు. దీనికి బాధ్యత ఎవరిది.. లేఖ రాయించిన జగన్ దా లేక రాసిన సీఎస్ దా అనేది చెప్పాలని కోరారు. జగన్ కి ఎన్నికల మీదే దృష్టి తప్ప ప్రజల ప్రాణాలంటే లెక్క లేదన్నారు.