దేశంలో నమోదవుతున్న కరోనా కేసులలో దాదాపు నాలుగోవంతు గల మహారాష్ట్రలో జూన్ వరకు లాక్ డౌన్ కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ముంబై, పుణెల్లో కరోనా కేసుల ఉధృతి బాగా ఉంది.
దేశంలో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ సడలింపు పట్ల సుముఖత వ్యక్తం చేస్తున్నప్పటికీ మహారాష్ట్ర మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో వైరస్ ఉదృతి ఇలా కొనసాగితే లాక్ డౌన్ ను జూన్ చివరి నాటికి పొడగించే అవకాశమున్నదని అధికార వర్గాలు సంకేతం ఇస్తున్నాయి.
ఇందుకుగాను మహారాష్ట్రలోని ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇదే విషయాన్ని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. లాక్డౌన్ పొడగించకుంటే పరిస్థితి చేజారిపోయే ప్రమాదం ఉందంటూ హెచ్చరిస్తున్నారు. లాక్ డౌన్ అమలులోనూ మరింత కఠినంగా ఆంక్షలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి రోజు సగటున 200 కేసులు ముంబై నగరంలోనే నమోదవుతున్నాయి.
గత 24 గంటల్లో మహారాష్ట్రలో 394 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కాగా.. 18మంది మృతి చెందారు. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,817కు చేరింది. ఇక కరోనాతో మరణించిన వారి సంఖ్య 301కి చేరింది.
ఇక, దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కరోనా విలయతాండవం చేస్తోంది. ముంబయిలో ఏకంగా 4,447 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో 80 శాతం కేసులు ముంబయిలోనే ఉన్నాయి.