YS Jagan And Tammineni: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైఖరి వింతగా ఉంటుంది. ఆయన అనుకున్నది చేస్తారు.. అనుకున్నారంటే ఎంతస్థాయికైనా వెళ్తారు. అందుకే ఇటీవల తప్పులు చేసిన వారిని కూడా సమర్థిస్తున్నారు. తమ పార్టీ నేతలు చేతిలో బాధితులుగా మిగిలిన వారిపై సానుభూతి చూపడం కంటే.. తమ వారిని వెనకేసుకొచ్చి రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు తమ్మినేని సీతారాం విషయంలో కూడా అలానే వ్యవహరించారు. బతికున్న ఒక వ్యక్తిని మరణించినట్టు చూపి.. ఆయన వారసుల పేరుతో బయట వ్యక్తులను తెచ్చి.. నాలుగు కోట్ల రూపాయల విలువైన భూమిని కొల్లగొట్టాలని చూశారు. నిజమైన బాధితుల ఫిర్యాదుతోనే ఈ అంశం వెలుగులోకి వచ్చింది. కేసు కూడా నమోదయింది. ఓ 13 మంది వరకు అరెస్టు అయ్యారు కూడా. అరెస్టు భయంతో తమ్మినేని ఫ్యామిలీ పరారీలో ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి ఇంతవరకు ఈ అంశంపై స్పందన రాలేదు.
* ఆ పని చేయలే..
తమ్మినేని సీతారాం సాధారణ నాయకుడు కాదు. ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. పైగా స్పీకర్ వంటి రాజ్యాంగబద్ధ పదవి చేపట్టారు. అటువంటి నాయకుడు దారుణమైన రీతిలో ఫోర్జరీ పత్రాలతో కబ్జా కుట్రకు పాల్పడితే.. వేరే పార్టీలో అయితే కచ్చితంగా సస్పెండ్ చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు. క్రమశిక్షణ పాటించని, ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలను దూరం పెట్టి పార్టీ నిజాయితీని నిరూపించుకునే అవకాశం ఉన్నప్పటికీ… జగన్మోహన్ రెడ్డి వైఖరి మాత్రం అందుకు భిన్నంగా ఉంది.
* ఇటీవల పరిణామాలతో..
ఇటీవల జరిగిన పరిణామాల విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన రాజకీయం ఆయన పార్టీ వారికి సైతం నచ్చలేదు. రౌడీ షీటర్ సాయి కృష్ణకు బహిరంగంగా మద్దతు పలకడం నుంచి.. ఇటీవల తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడికి బాహటంగా రక్షణగా నిలవడం వరకు.. జగన్ తీసుకున్న పొలిటికల్ లైన్ సొంత పార్టీ వారికి నచ్చడం లేదు. ఎంత పెద్ద తప్పు చేసినా సరే పార్టీ నేతలను సమర్థించడమే లీడర్ షిప్ గా భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. తమ్మినేని సీతారాం వ్యవహారంలోనూ ఆయన ఖండించకపోగా.. వెనుకేసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కచ్చితంగా ఇది పార్టీకి మైనస్ చేస్తుందన్న వారే అధికం.






