Jagan Prashanth Kishore: ఆంధ్రప్రదేశ్ లో ఇప్పట్లో ఎలాంటి ఎన్నికలు లేవు. స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్, కార్పొరేషన్ వగైరా ఎన్నికలన్నీ పూర్తయి పోయాయి. ఒక్క బద్వేల్ ఉప ఎన్నిక జరుగాల్సి ఉండగా కరోనా కారణంగా ఆ ఎన్నిక కూడా తాజాగా వాయిదా పడింది. ఇక ఈ ఉప ఎన్నిక ఎప్పుడు జరిగినా వైసీపీ గెలుపు ఏకపక్షమేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ప్రభుత్వం సైతం ఎన్నికల కంటే కూడా ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది.
జగన్ సర్కారు ఇప్పటికే రెండున్నేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మరో రెండున్నేళ్లపాటు అధికారంలోకి ఉండనుంది. ఈ రెండేన్నళ్లలో ఒక ఏడాదిని ఎన్నికల సంవత్సరంగా తీసేస్తే మిగిలింది ఒక సంవత్సరన్నర. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం ఎన్నికల కంటే కూడా అభివృద్ధి, సంక్షేమ పథకాలపైనే ఎక్కువగా దృష్టిసారిస్తున్నారు. ఇలాంటి సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళుతారనే ప్రచారం ఏపీలో జోరుగా సాగుతోంది.
ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్ అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా ఓ అరగంటసేపు భేటి అయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన మంత్రివర్గ సహచరులకు పలు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి నుంచే మంత్రులంతా ఎన్నికల మూడ్ లోకి వెళ్లాలని సూచించినట్లు సమాచారం. మరోవైపు వచ్చే ఏడాది నుంచే ఏపీలో పీకే టీం రంగంలోకి దిగుతుందని వారికి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వ్యూహంపై రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.
గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరుపున ప్రశాంత్ కిషోర్(పీకే) రాజకీయ వ్యూహకర్తగా పని చేశారు. ఆయన ఆధ్వర్యంలోని ఐప్యాక్ వైసీపీ తరుపున రెండేళ్లు పనిచేసి వైసీపీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చేలా చేసింది. ఏపీ చరిత్రలోనే కనివీనీ ఎరుగని విక్టరీని జగన్మోహన్ రెడ్డి సొంతం చేసుకోవడంతో పీకేపై ఆయనకు గురి కుదిరింది. ఇటీవల పశ్చిమబెంగాల్ ఎన్నికల్లోనూ మమత బెనర్జీ పార్టీకి వ్యూహాకర్తగా పని చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీని సమర్ధవంతంగా ఎదుర్కొని పశ్చమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురాగలిగారు.
ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్ధితుల్లో పీకే టీం ఎన్డీయేకు వ్యతిరేక కూటమిని తయారుచేస్తోంది. ఇందుకోసం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తోపాటు మమతా బెనర్జీ.. కేజ్రివాల్ వంటి వారిని పీకే కలుపుకుపోయే ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది పంజాబ్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అక్కడ పీకే దృష్టిసారిస్తున్నారు. ఆ తర్వాత హర్యానా.. యూపీ ఎన్నికలపై ఫోకస్ పెట్టనున్నారు. అనంతరం ఏకంగా దేశవ్యాప్తంగా జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఎన్టీయే కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కూటమికి అనుకూలంగా ఆయన పని చేయనున్నారు.
ఇదే సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కోసం పీకే పని చేయడం కత్తి మీద సాములా మారింది. దీంతో ఆయన వైసీపీని కాంగ్రెస్ కూటమిలో చేరేలా ఆహ్వానం పంపుతున్నట్లు తెలుస్తోంది. అయితే కిందటి ఎన్నికల్లో ఆయన జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం పని చేసినందునా వచ్చే ఎన్నికల్లోనూ ఆయనే వ్యూహాకర్తగా ఉంటారనే టాక్ విన్పిస్తుంది. ఆయన ఎంత బీజీ షెడ్యూల్ ఉన్నా జగన్ కోసం పని చేస్తారని వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు.
ఈక్రమంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు సైతం ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల వచ్చే దేశంలో జరిగే ఎన్నికల ప్రభావం ఏపీపై ఉండదని భావిస్తున్నారు. మొత్తానికి ఏపీలో జగన్మోహన్ రెడ్డి, పీకే కలిసి ప్రచారం చేస్తే ఆ కిక్కే వేరని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఏదిఏమైనా రాబోయే అసెంబ్లీ ఎన్నికలను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.