Amarinder Singh: కాంగ్రెస్ పార్టీ మరో నేతను కోల్పోయింది. కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టిన పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆయనను దూరం చేసుకోవడం కాంగ్రెస్ పార్టీకే నష్టం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పలు స్టేట్లలో ఇలాంటి స్వయంకృతాపరాధాలతోనే నేతలను దూరం చేసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరీందర్ సింగ్ రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది.
అమరీందర్ సింగ్ 2014 లోక్ సభ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చారు. అత్యధిక స్థానాలు దక్కించుకునేలా ఆయన కీలక పాత్ర పోషించారు. దేశంలోనే కాంగ్రెస్ పార్టీ అధ్వాన స్థితిలో ఉన్న సమయంలో ఆయన తన శక్తియుక్తులను ధారపోసి కాంగ్రెస్ ను గెలుపు బాటలో ముందుంచారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ను ఆదుకున్న నేత అమరీందర్. కానీ కాంగ్రెస్ పార్టీ అనవసర పట్టింపులకు పోయి అమరీందర్ ను దూరం చేసుకోవడం పార్టీకి తీరని లోటని తెలుస్తోంది.
కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో సైన్యంలో పని చేశారు. ఆయనతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ విజయంలో తనదైన ముద్ర వేశారు. పంజాబ్ లో పార్టీని బతికించి దాని స్థాయిని పెంచిన నేత అమరీందర్ సింగ్. కానీ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోతిసింగ్ సిద్దూతో ఉన్న విభేదాల కారణంగానే ఆయన పార్టీకి దూరమవుతున్నట్లు తెలుస్తోంది. కానీ కాంగ్రెస్ కు మాత్రం పెద్ద నష్టమే జరగబోతోందని సమాచారం.
గతంలో కూడా కాంగ్రెస్ తో ఉన్న విభేదాల కారణంగా పార్టీ నుంచి బయటకు వెళ్లిన అమరీందర్ కొంతకాలం అకాలీదళ్ పార్టీలో చేరారు. తరువాత సొంత పార్టీ స్థాపించినా తరువాత కాలంలో దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసి 2017లో పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ విజయంలో ముఖ్య భూమిక పోషించారు. అయినా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆయన ప్రతిభను గుర్తించకుండా దూరం చేసుకోవడం మంచిదికాదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.