ఇప్పటివరకు చంద్రబాబుకు హైటెక్ బాబు అనే పేరుంది. ఎప్పుడు కూడా ప్రచారాలకు వెళ్లినా.. బహిరంగ సభల్లో పాల్గొన్నా తాను చేసిన హైటెక్ అభివృద్ధే గురించే మాట్లాడుతుంటారు. కానీ.. ఈసారి ఎప్పుడూ లేని విధంగా మొహమాటాన్ని పక్కన పెట్టి హిందూ నినాదాన్ని ఎత్తుకుంటున్నారట. హిందూ అజెండాతో ముందుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారని ప్రచారం.
Also Read: ‘అంతర్వేది’ ఘటన నేపథ్యంలో ఏపీ పోలీసుల సంచలనం
ముఖ్యంగా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి ఆలయ రథం దగ్ధం నుంచి ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా ఇన్సైడ్ టాక్. అంతర్వేది ఘటనలో ఏపీ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట. ప్రభుత్వ వైఫల్యం వల్లే హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, అలాగే ఏపీలో జరుగుతున్న మతమార్పిడులపైనా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని టీడీపీ భావిస్తోంది. అంతేకాదు అంతర్వేది ఘటన తర్వాత సీబీఐని ఈ వ్యవహారాన్ని నిగ్గు తేల్చాల్సిందిగా కేంద్రానికి లేఖ రాశారు.
అయితే.. కేంద్రం స్పందించే లోపే ఏపీ సీఎం జగన్ ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నారు. నిజనిజాలు తేల్చాల్సిందే అంటూ సీబీఐకి లేఖ రాశారు. అయితే.. ఈ వ్యవహారాన్నంతా తమకు అనుకూలంగా మార్చుకుని పైచేయి సాధించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారట. వారం రోజుల పాటు రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో పూజలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. 2020 సెప్టెంబర్ 13వ తేదీ ఆదివారం సూర్య దేవాలయాలు, సోమవారం శివాలయాలు మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయాల్లో, బుధవారం అయ్యప్ప, గణపతి, శుక్రవారం కనకదుర్గమ్మ, శనివారం వైష్ణవాలయాల్లో పూజలు నిర్వహిస్తూ వైసీపీ ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలపాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. అయితే ఒక్కసారిగా చంద్రబాబు ఇలా యూటర్న్ తీసుకోవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also Read: కబ్జాదారులకు షాక్ ఇవ్వబోతున్న జగన్ సర్కార్…?
గతంలో ఎప్పుడూ మతాల జోలికి పోని చంద్రబాబు ఇప్పుడు అదే రాగం ఎత్తుకోవడం రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. హిందూ దేవాలయాల పై జరుగుతున్న దాడులే ప్రధాన ఎజెండాగా తీసుకుని ప్రభుత్వంపై పోరాడాలని ఆలోచిస్తున్నారు. అంతర్వేది వ్యవహారంపై ఓ వైపు బీజేపీ పోరాడుతున్నా.. అంతగా మైలేజ్ రావడం లేదని.. టీడీపీకి ఆ క్రెడిట్ దక్కుతుందని చంద్రబాబు అంచనాలో ఉన్నారు. గతంలో ఈ తరహా ఘటనలు జరిగినా పెద్దగా స్పందించని టీడీపీ.. ఎప్పుడైతే బీజేపీ రంగంలోకి దిగిందో అప్పటి నుంచి తేరుకున్నట్లు కనిపిస్తోంది. ఇదంతా తమ క్రెడిట్ అని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నంలోనే జగన్ సర్కార్ స్పందించింది. సీబీఐ ఎంక్వైరీ చేయించాలని కేంద్రాన్ని కోరింది.