TDP MLC Candidates: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ప్రారంభం అయింది. గత వైసిపి ప్రభుత్వంలో గవర్నర్ కోటా కింద ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారు. మండలి డిప్యూటీ చైర్ పర్సన్ జాకియా ఖానం, పండుల రవీంద్రబాబు ఈరోజు పదవి విరమణ చేయనున్నారు. దీంతో ఈ రెండు స్థానాల భర్తీకి ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. నోటిఫికేషన్ జారీ చేయనుంది. అయితే ఈ రెండు ఎమ్మెల్సీ సీట్లను తెలుగుదేశం పార్టీ తీసుకోవాలని భావిస్తోంది. దీంతో ఆ పార్టీలో ఆశావాహులు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ రెండు పదవులకు 20 మందికి పైగా ఆశావహులు ఉండడంతో ఎంపిక అనేది కత్తి మీద సాము. ప్రధానంగా సీనియర్లు, సీట్లు త్యాగం చేసిన వారు ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా ఈ రేసులో కృష్ణాజిల్లా నేతలు ఉన్నారు.
* సీనియర్లు అధికం..
సాధారణంగా ఎమ్మెల్సీ పదవులు అంటేనే విపరీతమైన డిమాండ్ ఉంటుంది. మొన్నటి ఎన్నికల్లో చాలామంది సీనియర్లు తప్పుకున్నారు. మూడు పార్టీల పొత్తు నేపథ్యంలో సీట్లు వదులుకున్న వారు ఉన్నారు. అటువంటి వారికి పార్టీ హై కమాండ్ నామినేటెడ్ పోస్టులతో పాటు ఎమ్మెల్సీ పదవులు హామీ ఇచ్చింది. అయితే ఇప్పటికే నామినేటెడ్ పోస్టులతో కొంత భర్తీ చేశారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఓ 20 మంది నేతలు ఎమ్మెల్సీలతో పాటు రాజ్యసభ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతుండడంతో తమ పేర్లను పరిగణలోకి తీసుకోవాలని హై కమాండ్ ను కోరుతూ వచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్సీల ఎంపికపై సీఎం చంద్రబాబు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో అభ్యర్థుల ప్రకటనకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
* రేసులో కృష్ణా జిల్లా నేతలు…
ప్రధానంగా రేసులో కృష్ణా జిల్లా నేతలు ఉన్నారు. ప్రముఖంగా సీనియర్ నేత వర్ల రామయ్య పేరు వినిపిస్తోంది. ఆయనకు తప్పకుండా పదవి ఇస్తారని తెలుస్తోంది. రాజ్యసభ పదవుల భర్తీ సమయంలో వర్ల రామయ్య పేరు బయటకు రావడం.. వివిధ సమీకరణల్లో ఇవ్వకపోవడం పరిపాటిగా మారింది. అందుకే వర్ల రామయ్య కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆనవాయితీని బ్రేక్ వేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వంగవీటి రాధాకృష్ణ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇంకోవైపు కొమ్మాలపాటి శ్రీధర్, జనార్ధన్, బుద్దా వెంకన్న, గొట్టిపాటి ల పేర్లు కూడా ప్రముఖంగా తెరపైకి వచ్చాయి. మరోవైపు రాయలసీమకు ఒక ఎమ్మెల్సీ సీటు ఇస్తారని కూడా ప్రచారం సాగుతోంది. పోటీలో రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి, తిప్పే స్వామి, బీటెక్ రవి, ప్రభాకర్ చౌదరి, గోనుగుంట్ల పేర్లు సైతం బయటకు వచ్చాయి. అయితే చంద్రబాబుతో పాటు లోకేష్ అన్ని సమీకరణలను పరిగణలోకి తీసుకొని ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.