Chandrababu: ఏపీలో పొత్తులపై క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే టిడిపి, జనసేన మధ్య పొత్తు వాతావరణం నెలకొంది. అటు బీజేపీతో జనసేన మిత్రపక్షంగా కొనసాగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో ఢిల్లీ వెళ్లి చంద్రబాబు బిజెపి నేతలతో పొత్తుల చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ ను కట్టడి చేసే విధంగా చంద్రబాబు బిజెపి ముందు మంచి ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. ఎన్డీఏలోకి ఎంట్రీ, వారాహి యాత్రతో పవన్ ఫుల్ జోష్ గా ఉన్నారు. అటు జనసేన గ్రాఫ్ సైతం అమాంతం పెరిగినట్లు సంకేతాలు వస్తున్నాయి. ఈ తరుణంలో పవన్ కట్టడి చేయకుంటే పవర్ షేరింగ్ తెరపైకి వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ప్రత్యేక వ్యూహం పన్నారు.
ఏపీలో పొత్తులు లేకుంటే బిజెపి జీరో. ఈ విషయం ఆ పార్టీ హైకమాండ్ పెద్దలకు కూడా తెలుసు. అందుకే ఓట్లు సీట్లు పెంచుకోవాలన్న యోచనలో బిజెపి ఉంది. దీనిని గమనించిన చంద్రబాబు బిజెపికి ఎదురెళ్లి ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బిజెపి గాని టిడిపితో పొత్తు కుదుర్చుకుంటే 15 శాసనసభ, ఐదు ఎంపీ సీట్లు ఇస్తానని చంద్రబాబు బిజెపి అగ్రనేతల వద్ద ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. వాస్తవానికి బిజెపికి అంత బలం లేకపోయినా.. జనసేన ను సీట్ల పరంగా కట్టడి చేసేందుకే.. బిజెపికి చంద్రబాబు ఈ ఆఫర్ ప్రకటించారని టాక్ నడుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో పొత్తులు కుదిరితే 40 నుంచి 50 స్థానాలను జనసేన కోరే అవకాశం ఉంది. కానీ చంద్రబాబు మాత్రం అందుకు సమ్మతించడం లేదు. జనసేన ఎక్కువ స్థానాల్లో గెలుపొందితే పవర్ షేరింగ్ కు పట్టుబడే అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు వ్యూహాత్మకంగా ఆలోచిస్తున్నారు. బిజెపికి, జనసేన కలిపి 30 అసెంబ్లీ స్థానాలకు మించకూడదని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే జనసేనతో సమానంగా బిజెపికి సీట్లు కేటాయించనున్నట్లు సంకేతాలిస్తున్నారు. తద్వారా బిజెపి నుంచి పవన్ పై ఒత్తిడి పెరుగుతుందని భావిస్తున్నారు. తక్కువ సీట్లకే పవన్ ఒప్పుకుంటే.. పవర్ షేరింగ్ ప్రతిపాదన రాదన్నది చంద్రబాబు భావన. అయితే దీనిపై బీజేపీ అగ్రనేతలు మౌనం దాల్చినట్టు సమాచారం. మరి చంద్రబాబు పాచిక పారుతుందో లేదో చూడాలి మరి.