ఏపీలోని అత్యంత కరువు ప్రాంతం రాయలసీమకు జలధారలు ప్రవహించేలా చేసేందుకు ఏపీ బీజేపీ కదిలింది. రాయలసీమకు కృష్ణా జలాలను తరలించే ‘రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును’ ఆమోదించాలని ఏపీ బీజేపీ బృందం కేంద్ర జల్ శక్తి మంత్రిని కలిసి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ ను ఆయన నివాసంలో కలిసిన సోము వీర్రాజు సారథ్యంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ బృందం ఈ మేరకు ఏపీ సమస్యలపై ఆయనకు విన్నవించింది..
ఈ మధ్యనే పోలవరం ప్రాజెక్టును సమీక్షించిన సోము వీర్రాజు అనంతరం పోలవరం నిర్వాసితులు,ముంపు గ్రామాలు తదితర అంశాలను మంత్రికి వివరించారు. ఆర్ ఆర్ ప్యాకేజీకి సంబంధించి ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఇప్పటివరకూ సాయం అందలేదని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ప్రాజెక్ట్ ల స్టేటస్లు వివరించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేజర్,మైనర్ ప్రాజెక్టులకు సంబంధించి చర్చించారు.
రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో చొరవ చూపి ఆయా ప్రాంతానికి న్యాయం చేయాలని సోము వీర్రాజు కేంద్ర జలశక్తి మంత్రికి విన్నవించారు. కరువుతో అల్లాడే సీమకు నీటి అవసరం ఉందన్నారు. ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలంటే ప్రాజెక్ట్ అవసరం అన్నారు. విజయవాడలో జరిగిన నీటి రంగ నిపుణులు రౌండ్ టేబుల్ సమావేశంలో వారి సలహాలు సూచనలు సోము వీర్రాజు కేంద్రమంత్రికి వివరించారు.
ఏపీ సమస్యలపై కేంద్ర జలశక్తి మంత్రి సానుకూలంగా స్పందించారని.. అనంతరం కేంద్ర మంత్రిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు ఆహ్వానించమని ఆయన ఓకే అన్నారని సోము వీర్రాజు తెలిపారు.
కేంద్ర మంత్రిని కలిసిన బృందంలో సభ్యులు సోము వీర్రాజుతో పాటు మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ , ఎంపీలు సి.ఎం.రమేష్,టి.జి.వెంకటేష్, ఙివిఎల్ ,విష్ణువర్ధన్ రెడ్డి ,పివిఎన్ మాధవ్,భానుప్రకాశ్ రెడ్డి ఉన్నారు