Nallari Kiran Kumar Reddy: ఏపీ బీజేపీలో చాలామంది నేతలు ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ నేతలు బాగానే గెలిచారు. 8 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి విజయం సాధించారు. మరో ముగ్గురు ఎంపీలు సైతం ఉన్నారు. ఒక రాష్ట్ర మంత్రి తో పాటు కేంద్ర మంత్రి కూడా ఉన్నారు.. ఎందరు ఉన్న బిజెపి పెద్దగా సౌండ్ చేయడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి లైన్ లోకి వచ్చారు. ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రాల మధ్య జలవివాదం గురించి మాట్లాడారు. ఏపీ ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. జలవివాదాలు విషయంలో ఎటువంటి మొహమాటలకు పోవద్దని.. పక్క రాష్ట్రాలతో చర్చలు జరిపి పరిష్కరించుకోవాలని సూచించారు. అవసరం అనుకుంటే పోరాటం చేయాలని కూడా పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన సాహేతుకంగా జరగలేదని.. అప్పట్లోనే జల పంపకాలు చేపడుతూనే వివాదాలు పరిష్కరించుంటే ఇంతవరకు పరిస్థితి వచ్చి ఉండేది కాదు అని అభిప్రాయపడ్డారు కిరణ్ కుమార్ రెడ్డి.
* ఉమ్మడి రాష్ట్రానికి చివరి సీఎం..
ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో రోశయ్య ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన స్వచ్ఛందంగా తప్పుకోవడంతో.. స్పీకర్ గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆయన హయాంలోనే రాష్ట్ర విభజన జరిగింది. దానిని తీవ్రంగా వ్యతిరేకించారు కిరణ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ అగ్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. సొంతంగా సమైక్యాంధ్ర పార్టీని ఏర్పాటు చేశారు. కానీ అది అంతగా వర్కౌట్ కాలేదు. చివరకు బిజెపిలోకి వచ్చి ఆ పార్టీ తరఫున మొన్నటి ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఉన్నట్టుండి మీడియా ముందుకు వచ్చి రాష్ట్ర విభజన సమస్యలు, జలవివాదాలు గురించి ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
* జల వివాదాల ప్రస్తావన..
ప్రస్తుతం గోదావరి తో పాటు కృష్ణా జలాలకు సంబంధించి వివాదాలు నడుస్తున్నాయి. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం ఉంది. ఆపై పోలవరం ప్రాజెక్టు విషయంలో ఒడిస్సా తో పాటు చత్తీస్గడ్ తో కూడా వివాదం నడుస్తోంది. వాటన్నింటినీ పరిష్కరించుకోవాలని ఏపీ ప్రభుత్వానికి కిరణ్ కుమార్ రెడ్డి సూచించడం గమనార్హం. అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వంతో గట్టిగా మాట్లాడాలని సూచిస్తున్నారు కిరణ్. ఎన్నికల వరకు మాత్రమే పొత్తు కానీ.. పార్టీలు, ప్రభుత్వం వేరు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. అయితే చాలా రోజులకు కిరణ్ కుమార్ రెడ్డి ముందుకు రావడం గమనార్హం. రాష్ట్రం కోసం కీలక సూచనలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే రాజ్యసభ ఎన్నికల సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ వివిధ సమీకరణల్లో ఆయనకు పదవి దక్కలేదు. ఇప్పుడు ఆయన పొలిటికల్ గా యాక్టివ్ అవుతారన్న టాక్ వినిపిస్తోంది. అందులో భాగంగానే సరిహద్దు జలాల వివాదంపై మాట్లాడుతున్నారని ప్రచారం సాగుతోంది. మరి చూడాలి ఆయన పాత్ర ఎలా ఉండబోతుందో..