BRS Vs Congress: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య కరెంటు మంటలు చల్లారడం లేదు. టీపీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ నేతలు 24 గంటల కరెంటుపై సవాళ్లు విసురుతున్నారు. తాము రాజీనామాకు రెడీ.. మీరు రెడీనా అటూ సవాళ్ చేయడంతో అధికార బీఆర్ఎస్కు కరెంట్ షాక్ గట్టిగానే తగిలినట్లు అనిపిస్తోంది. కాంగ్రెస్ సవాల్ను స్వీకరించడానికి ఎవరూ ముందుకు రాకపోవడం లేదు. అయితే తాము తగ్గామన్న భావన ప్రజల్లో రాకుండా ముఖ్యమంత్రి, ముఖ్యమైన మంత్రి.. మంత్రులు, నేతలతో ప్రెస్మీట్లు పెట్టిస్తున్నారు. కరెంటు మంటలు చల్లారకుండా చూసుకుంటున్నారు.
రేవంత్ వ్యాఖ్యలతో రగిలిన నిప్పు..
ఇటీవల అమెరికాకు వెళ్లిన పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మూడు ఎకరాల భూమి ఉన్న రైతులకు మూడు గంటల ఉచిత విద్యుత్ సరిపోతుందని అక్కడి ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాడు. దీనిని తమకు అనుకూలంగా మార్చుకునేందకు బీఆర్ఎస్ నాయకులు వీడియో మొత్తం ప్లే చేయకుండా మూడు గంటల కరెంటు చాలు అనే మాటలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అంతటితో ఆగకుండా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిరసనలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ను గెలిపిస్తే ఉచిత విద్యుత్ ఎత్తివేస్తారనే ప్రచారం చేయించారు. ఈమేరకు బీఆర్ఎస్ శ్రేణులను రోడ్డు ఎక్కించారు. ధర్నాలు, దిష్టిబొమ్మల దహనాలతో నిరసనలుత తెలిపారు.
రేవంత్ క్లారిటీ.. బీఆర్ఎస్కు సవాళ్లు..
ఇక ఇండియాకు వచ్చిన రేవంత్రెడ్డి అమెరికాలో తాను మాట్లాడిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. కరెంటు పేరుతో తెలంగాణ ప్రభుత్వం వేలకోట్ల ప్రజాధనం వృథా చేస్తుందని ఆరోపించారు. 90 శాతం రైతులు మూడెకరాలలోపు వారే అని వారికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందని చెప్పానని తెలిపారు. బషీర్బాగ్ కాల్పుల సమయంలో కేసీఆర్ టీడీపీలో ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. కేసీఆర్ కారణంగానే నాడు పోలీసులు కాల్పులు జరిపారని ఆరోపించారు. 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న నేతలు ఎక్కడ ఉచిత విద్యుత్ ఇస్తున్నారో చూపాలని సవాల్ చేశారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డితోపాటు పలువురు నేతలు కూడా బీఆర్ఎస్కు సవాల్ విసిరారు. 24 గంటల కరెంటు రావడం లేదని నిరూసిస్తే రాజీనామా చేస్తావా అని కేటీఆర్ను డైరెక్ట్గా ఎటాక్ చేశారు. దీంతో బీఆర్ఎస్ దగ్గర సమాధానం కరువైంది.
మౌనంగా ఉండలేక..
కాంగ్రెస్ సవాళ్లపై మౌనంగా ఉంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతం వెళ్తుందని భావించిన బీఆర్ఎస్ నాయకులు ప్రెస్మీట్లు, నిరసనలు కొనసాగిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి గారు, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి , ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లారు. కరంట్ షాక్తో కాంగ్రెస్ విలవిలలాడుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. టీపీసీసీ చీఫ్ తప్పులు మాట్లాడి సరిదిద్దుకోకుండా సవాళ్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుకు ఎదురువచ్చి సాయం చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదని చెప్పుకున్నారు. ఒకనాడు కరంటు లేక, ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోయి విద్యుత్ కార్యాలయాల చుట్టూ తిరిగిన దుస్థితి తెలంగాణ రైతులది, ఇప్పుడు అలాంటి సమస్యలు లేవన్నారు.
అధికారం కోసమే కాంగ్రెస్ ఆరాటం..
అధికారం కోసం తప్ప ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ ఆలోచించలేదు.. దానికి ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ పాలన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ గొప్పదనం కాదన్నారు. తెలంగాణ ఇచ్చామని చెప్పడంలోనే కాంగ్రెస్ అహంకారం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ప్రజల హక్కు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఏం చేయాలన్నా ఢిల్లీలో స్విచ్ నొక్కాలి .. బీఆర్ఎస్ పార్టీ ఆత్మ తెలంగాణ రాష్ట్రం అని సెంటుమెంటు వల్లించారు. శాసనసభ ఉప సభాపతిగా ఉన్నప్పుడే కేసీఆర్ గారు కరెంటు చార్జీల పెంపును నిరసిస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సవాళ్లపై స్పందనేది?
ఇదిలా ఉంటే ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్సీ ప్రెస్మీట్ పెడితే కాంగ్రెస్ సవాల్ను స్వీకరించడానికి పెట్టారని అంతా అనుకున్నారు. అందుకే మీడియా ప్రతినిధులు భారీగా తరలివచ్చారు. మంత్రు మాటలు ఆసక్తిగా విన్నారు. కానీ చివరకు కాంగ్రెస్ సవాల్పై ముగ్గురిలో ఒక్కరు కూడా నోరు మెదపలేదు. ఇక్కడే 24 కరెంటు నిజం కాదన్న విషయం అర్థమైంది.