Kodi Katti Case
Kodi Katti Case: కోడి కత్తి కేసులో కీలక మలుపు. కేసుకు సంబంధించి నిందితుడి తరుపు న్యాయవాది కీలక ప్రకటన చేశారు. ఇందులో కుట్ర కోణం లేదని.. రాజకీయంగా సానుభూతి కోసమే ఈ ఘటనకు పురి గొలిపారని వెల్లడించారు. పక్కా స్కెచ్ తోనే జరిగిందని చెప్పుకొచ్చారు. కోడి కత్తి సమకూర్చింది మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు, ప్రస్తుత విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అని వెల్లడించారు. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గత ఐదు సంవత్సరాలుగా కోడి కత్తి శీను జైల్లో మగ్గుతున్నారు. కానీ బెయిల్ లభించడం లేదు. నిందితుడు తల్లి ఎంతలా ప్రయత్నిస్తున్నా బెయిల్ మాత్రం మంజూరు కావడం లేదు. ప్రస్తుతం ఈ కేసు విజయవాడ నుంచి విశాఖ కోర్టుకి బదిలీ అయినా.. నిందితుడిని మాత్రం రాజమండ్రి జైల్లోనే ఉంచారు. 2018లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పాదయాత్ర చేశారు. ప్రతి శుక్రవారం సిబిఐ కేసు విచారణకు హాజరయ్యేవారు. విజయనగరంలో పాదయాత్ర చేస్తుండగా.. కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కోర్టుకు హాజరయ్యేందుకు వెళుతుండగా విశాఖ ఎయిర్ పోర్ట్ లో జగన్ పై దాడి జరిగింది. కోడి కత్తితో శీను అనే యువకుడు దాడి చేశాడు. జగన్కు సానుభూతి తెచ్చి పెట్టేందుకే తాను ఈ ఘటనకు పాల్పడినట్లు శీను విచారణలో పేర్కొన్నాడు. ఈ కేసులో కుట్ర కోణం లేదని ఇప్పటికే ఎన్ఐఏ తేల్చి చెప్పింది.
జగన్ సీఎం కావాలని పెద్ద స్కెచ్ వేసి దాడి చేసిన శీను గత ఐదేళ్లుగా జైలు జీవితం గడుపుతున్నాడు. కోడి కత్తి శీను ఆశించినట్టుగానే జగన్ బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. కానీ ఇంతవరకు శీనుకు బెయిల్ మంజూరు కాలేదు. ఆయనకు బెయిల్ రాకుండా అడ్డుకుంటుంది సీఎం అని న్యాయవాది ఆరోపిస్తున్నారు. ఆరోజు నిందితుడికి కోడి కత్తి సమకూర్చింది బొత్స మేనల్లుడు, ప్రస్తుత విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అని లాయర్ సలీం వెల్లడించారు.
కోడి కత్తి శ్రీను తల్లి జగన్ను వేడుకోని సందర్భం లేదు. కానీ సీఎం జగన్ మనసు కరగడం లేదు. ఈ ఘటనతో తన సానుభూతి తెచ్చి పెట్టడమే కాకుండా.. తనకు దొంగ వైద్యం చేసిన డాక్టర్లకు పదవులు కూడా ఇచ్చారు. కానీ ఈ ఎపిసోడ్లో కీలకమైన కోడి కత్తి శీనుకు మాత్రం ఉపశమనం లభించలేదు. వచ్చే ఎన్నికల్లో బలిపశువుగా కోడి కత్తి శీను వ్యవహారాన్ని వాడుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసు విచారణలో అడుగడుగునా జాప్యం జరుగుతుండడంతో.. సుప్రీమ్ ను ఆశ్రయించేందుకు కోడి కత్తి శీను తరపు న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు.