ఒకవంక కరోనా కట్టడిలో భారత్ చెప్పుకోదగిన విజయాలు సాధిస్తున్నామని, తీవ్రత తగ్గుముఖం పట్టినదని చెప్పుకొంటున్న తరుణంలో, మరో వారం రోజులలో లాక్ డౌన్ ను సడలించవచ్చని భావిస్తున్న సమయంలో దేశంలో కరోనా మూడో దశకు చేరుకుందన్న కధనం ఆందోళన కలిగిస్తున్నది. అయితే ఈ పరిస్థితి కొన్ని ప్రాంతాలకు పరిమితమైన్నట్లు చెబుతున్నారు.
కరోనా కట్టడిలో ప్రధానమంత్రికి సహకారం అందిస్తున్న కీలకమైన నిపుణుల బృందం సభ్యుడైన ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా నుండే ఈ అంశం వ్యక్తం కావడం గమనార్హం. దేశంలో పలు ప్రాంతాల్లో కరోనా వైరస్ రెండో దశను దాటి మూడో దశకు చేరుకుందని ఆయన ప్రకటించారు. అయితే మూడో దశ దేశ వ్యాప్తంగా కేవలం కొన్ని ప్రాంతాల్లోనే మాత్రమే ఉందని తెలిపారు.
సోమవారం ఢిల్లీలో ఓ కార్యక్రమంలో డాక్టర్ రణ్దీప్ మాట్లాడుతూ.. ‘దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరగడం ఆందోళనకరం. పలు ప్రాంతాల్లో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ (లోకల్ కాంటాక్ట్) ద్వారా వైరస్ సోకడాన్ని గుర్తించాం. దీనిని వైరస్ మూడోదశగా చెప్పుకోవచ్చు. అయితే ఈ దశ దేశంలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే విస్తరించింది’ అని చెప్పారు.
అయితే దేశ వ్యాప్తంగా అత్యధిక భాగం కేవలం రెండోదశలో ఉండంటం కొంత ఉపశమనం కలిగించే అంశమని తెలిపారు. కాగా, మూడోదశ అనేది మన దేశంలో ప్రస్తుతం ప్రారంభదశలోనే ఉందని, దానిని అదుపుచేయడానికి ఇప్పటికే తగిన చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు. దానిని ఎంత త్వరగా అరికడితే అంతమంచిందని చెబుతూ లేకపోతే మూడోదశ ఉధృతమైతే తీవ్ర పరిణామాలను ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు.
ఇక ఢిల్లీలోని మర్కజ్ మత ప్రార్థనాల కారణంగానే దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగాయని రణ్దీప్ స్పష్టం చేశారు. ప్రార్థనల్లో పాల్గొన్న వారిని గుర్తించడం కష్టతరమైనప్పటికీ.. ప్రభుత్వాలు చర్యలు సఫలమైయ్యాయని కొనియాడారు. వైరస్ కట్టడికి వైద్యులకు ప్రజలు సహకరించాలని కోరారు.
మరోవైపు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లాక్ డౌన్ ఎత్తివేయడం గురించి సరైన నిర్ణయం చెప్పలేమని, ఏప్రిల్ 10 తరువాత పరిస్థితులను బట్టి కేంద్ర ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పిస్తామని వెల్లడించారు.