ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజనులకు శుభవార్త చెప్పింది. వచ్చే ఆదివాసీ దినోత్సవం నాటికి గిరిజనులకు అటవీ భూములపై హక్కులు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. గిరిజనులు ఎంతో కాలంగా సాగు చేసుకుంటున్న అటవీ భూములకు సంభందించి హక్కులు కల్పించాలని నిర్ణయించింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖల మంతులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఎంతో కొంత వ్యవసాయం చేసుకుని గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు మంజూరు చేయాలని ఈ సందర్భంగా సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టా ఉన్న గిరిజన రైతులకు రైతు భరోసా అమలు చేస్తున్నందున, అటవీ భూములపై హక్కులు కల్పించడంతో గిరిజనులకు పెట్టుబడి సహాయం పొందడానికి అవకాశం కల్పించినట్లు అవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
అటవీ భూముల హక్కుల విషయంలో గిరిజనులు ఎంతో కాలంగా పోరాటాలు చేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో భూములను గిరిజనుల సాగుకు అనుకూలంగా మలుచుకుని సాగు చేసుకుంటున్నారు. అటవీ చట్టాలు వల్ల గిరిజనులకు ఆ భూములపై హక్కులు కల్పించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించి పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.