కరోనా సెకండ్ వేవ్ మార్చిలో మొదలైంది. అయితే.. మొదటి దశనే ఎదుర్కొన్నాం.. ఇదంతలే అనుకున్నారు అందరూ! కానీ.. కేవలం వారాల వ్యవధిలోనే తానెంత ప్రమాదకరమో చాటిచెప్పింది రెండో దశ. అనధికారికంగానే అన్ని రంగాలూ మూసేసుకోవాల్సిన పరిస్థితిని కల్పించింది. మిగిలిన రంగాల్లో అరకొరగా పనులు కొనసాగుతున్నా.. సినిమా రంగం కంప్లీట్ గా బందైపోయింది.
థియేటర్లు ఎప్పడో మూతపడ్డాయి. సినిమా షూటింగులు కూడా ఒక్కొక్కటిగా అన్నీ ప్యాకప్ చెప్పేశాయి. షెడ్యూల్స్ మధ్యలో ఉన్న ఒకటీ రెండు చిత్రాలు మాత్రమే సెట్స్ మీద ఉన్నాయి. ఇక, రిలీజ్ కు సిద్ధమైన చిత్రాలన్నీ స్లాట్ క్యాన్సిల్ చేసుకుని వెనక్కు వెళ్లిపోయాయి. దీంతో.. ప్రేక్షకుడికి సరైన వినోదం కరువైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో వినోద వనరు ఏదైనా ఉందంటే.. అది ఓటీటీ మాత్రమే.
కానీ.. ఓటీటీలో కొత్త కంటెంట్ కరువైపోయింది. గత లాక్ డౌన్ లో పలు చిన్న సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. రెండు మూడు పెద్ద సినిమాలు కూడా వచ్చాయి. వీటితోపాటు పలు వెబ్ సిరీస్ లు కూడా సందడి చేయడంతో ప్రేక్షకుడికి ఉపశమనం లభించింది. వినోదానికి పెద్దగా కొరత అనిపించలేదు.
కానీ.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఉన్న కంటెంట్ మొత్తం పాతబడిపోయింది. కొత్త కంటెంట్ రావట్లేదు. ఇప్పటికిప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సినిమాలేవీ సిద్ధంగా ఉన్నట్టు కనిపించట్లేదు. లవ్ స్టోరీ, టక్ జగదీష్, అరణ్య, ఆచార్య, అఖండ, ఖిలాడి వంటి చిత్రాలు సమ్మర్ లో సందడి చేయాల్సి ఉంది. కానీ.. థియేటర్లు మూతపడడంతో అవన్నీ రిలీజులు పోస్ట్ పోన్ చేసుకున్నాయి. ఇందులో ఏ సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా లేదు.
అనసూయ నటించిన ‘థాంక్యూ బ్రదర్’ మాత్రమే ఓటీటీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇంకా కొన్ని చిన్న సినిమాలతో ఓటీటీ సంస్థలు సంప్రదింపులు జరుపుతున్నాయి. మరి, ఇందులో ఏవి ఓకే అవుతాయన్నది తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో సగటు ప్రేక్షకుడికి వినోదం ఎండమావిగానే మారిపోయిందని చెప్పొచ్చు. ఈ పరిస్థితి ఇంకా ఎంత కాలం కొనసాగుతుందో చూడాలి.