సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం ‘మహర్షి’ జాతీయ అవార్డును దక్కించుకుంది. అత్యధిక ప్రజాదరణ పొందిన సినిమా విభాగంలో అవార్డు సొంతం చేసుకుంది. అయితే.. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లకముందే.. జాతీయ అవార్డు సాధిస్తుందని చెప్పాడు ప్రిన్స్ మహేష్. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు దర్శకుడు వంశీ.
ఈ సినిమా 2019లో విడుదలైంది. కానీ.. ఈ కథను 2017లోనే మహేష్ కు వినిపించాడు దర్శకుడు. ఆ సమయంలో మహేష్ – వంశీ మధ్య వాట్సాప్ చాటింగ్ జరిగింది. ఈ చిత్రానికి ముందు ‘ఊపిరి’ తీశాడు వంశీ. ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు గానూ ఫిల్మ్ ఫేర్ అవార్డు గెలుచుకున్నాడు దర్శకుడు వంశీ పైడిపల్లి.
ఇందుకు శుభాకాంక్షలు చెప్పిన మహేష్.. రాబోయే మన చిత్రం ద్వారా జాతీయ అవార్డు దక్కించుకుంటావని చెప్పాడు. కృతజ్ఞతలు చెప్పిన వంశీ.. అందుకోసం ప్రయత్నిస్తానని అన్నాడు. దీనికి రిప్లే ఇచ్చిన మహేష్.. ఈ సినిమాకోసం ఏం కావాలన్నా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఈ మూవీని నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లమని చెప్పాడు.
2017లో వీరిద్దరి మధ్య జరిగిన చాట్ ను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు వంశీ. మహేష్ ఉంచిన నమ్మకం వల్లే మహర్షికి ఈ పురస్కారం దక్కిందని, తనపై ఆయన ఉంచిన భరోసాకి ఇదే నిదర్శనమని పేర్కొన్నాడు. ఇది చూసినవారంతా ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. కనీసం సినిమా విడుదల కూడా కాకుండా.. సెట్స్ మీదకు కూడా వెళ్లకుండానే.. కథ విని చెప్పాడంటే.. మహేష్ జడ్జ్ మెంట్ రేంజ్ అర్థమవుతోందని అంటున్నారు ఫ్యాన్స్.