‘సర్కారు వారి పాట’ కథను మహేష్ ఎప్పడో విన్నాడు. గ్రీన్ సిగ్నల్ కూడా అప్పుడెప్పుడో ఇచ్చేశాడు. కానీ.. సినిమా ప్రారంభం కావడానికి నెలలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఫిబ్రవరిలో ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. దీనికి కారణం.. కరోనా విజృంభణే!
తొలి దశలో కరోనా వేవ్ కొనసాగినన్ని రోజులు ఇంటికే పరిమితం అయ్యాడు మహేష్. లాక్ డౌన్ ఎత్తేసి, షూటింగులకు అనుమతులు వచ్చిన తర్వాత కూడా చాలా రోజులు ఇంటి నుంచి బయటకు వెళ్లలేదు. ఫ్యామిలీకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే సెలబ్రిటీల్లో ప్రిన్స్ ముందువరసలో ఉంటాడు. అనవసరంగా రిస్క్ ఎందుకు అనుకున్నాడేమోగానీ.. కరోనా మొదటి దశ శాంతించే వరకు సెట్స్ లో అడుగు పెట్టలేదు.
ఫిబ్రవరిలో దుబాయ్ షెడ్యూల్ తో మొదలైన షూటింగ్ కొన్ని రోజులు నిర్విరామంగా సాగింది. అయితే.. కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో పలు షెడ్యూల్స్ క్యాన్సిల్ చేసేశాడు. అయితే.. ఇప్పుడు ఉన్నట్టుండి డైరెక్టర్ పరశురామ్ కు ఫోన్ చేసిన మహేష్.. షూటింగ్ మొదలు పెట్టాలని చెప్పాడట! దేశంలో రోజుకు లక్షా 80 వేల పైచిలుకు కేసులు నమోదవుతున్న ఈ దశలో షూటింగ్ స్టార్ట్ చేయాలని చెప్పడంతో యూనిట్ ఆశ్చర్యానికి లోనవుతోంది.
దీనంతటికీ కారణం త్రివిక్రమ్ అని సమాచారం. జూనియర్ తో త్రివిక్రమ్ సినిమా క్యాన్సిల్ అయిన తర్వాత.. మహేష్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే.. త్రివిక్రమ్ సినిమా మొదలవ్వాలంటే.. ‘సర్కారు వారిపాట’ త్వరాత ఫినిష్ అవ్వాలి. లేదంటే.. ఆ మూవీ లేటవ్వుద్ది. అదే జరిగితే.. రాజమౌళి సినిమా ఇంకా లేటవ్వుద్ది. ఇవి రెండూ జరగొద్దంటే.. ‘సర్కారు వారిపాట’ వేగంగా కంప్లీట్ అవ్వాలి. అందువల్లే.. ఇలాంటి కండీషన్లోనూ సెట్స్ లో అడుగు పెట్టడానికి సిద్ధమయ్యాడట మహేష్.