Hanumaan Junction movie story: మలుపులు సినిమాలోనే కాదు, ఆ సినిమాలను తెరకెక్కించే క్రమంలో కూడా అనేకం జరుగుతాయి. ‘హనుమాన్ జంక్షన్’ అనే సినిమా విషయంలో కూడా కొన్ని మలుపులు ఉన్నాయి. ‘హనుమాన్ జంక్షన్’ దర్శకుడు మోహన్ రాజా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘గాడ్ ఫాదర్’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే, తాజాగా మోహన్ రాజా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ‘హనుమాన్ జంక్షన్’ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.
20 ఏళ్ళ క్రితం నాటి జరిగిన సంఘటన ఇది. ‘హనుమాన్ జంక్షన్’ సినిమా కథను అనుకున్న తర్వాత.. ముందుగా హీరోలను మోహన్ బాబు, రాజశేఖర్ లను అనుకున్నారట. పైగా మోహన్ బాబు, రాజశేఖర్ లకు కథ కూడా చెప్పి.. వాళ్లకు అడ్వాన్స్ లు కూడా ఇచ్చారట. కానీ మోహన్ రాజా అప్పటికీ కొత్త దర్శకుడు. అయినా జగపతి బాబు చేసిన పాత్ర ప్లేస్ లో మోహన్ బాబును ఒప్పించాడు, అలాగే అర్జున్ చేసిన పాత్ర ప్లేస్ లో రాజశేఖర్ ను ఒప్పించాడు.
అయితే, మోహన్ బాబు, రాజశేఖర్ లకు అడ్వాన్స్ లు ఇచ్చిన తర్వాత, నిర్మాతలో భయం మొదలైందట. అసలుకే మోహన్ రాజా కొత్త దర్శకుడు, కాబట్టి మోహన్ బాబు, రాజ శేఖర్ లను హ్యాండిల్ చేయగలడా ?, రాజశేఖర్ చెప్పిన సమయానికి రాడు, ఇక మోహన్ బాబు వర్కింగ్ స్టైల్ ను మేనేజ్ చేయడం కష్టం. ఇలా అనేక అనుమానాల మధ్య అసలు మోహన్ రాజా వాళ్లతో ఈ సినిమా చేయలేడేమో అనే భయం మిగిలిన టీం మొత్తంలో ఎక్కువ అయిందట.
వాళ్ళ దెబ్బకు ఓ దశలో మోహన్ రాజా కూడా అసలు మోహన్ బాబు – రాజశేఖర్ లతో సినిమా చేయగలనా ? లేదా ? అనే సందిగ్ధంలో పడి, ఇక హీరోలను మార్చాలని నిర్ణయించుకున్నారట. అయితే ఎడిటర్ మోహన్ గారే హీరోలను మార్చడానికి ముఖ్య కారణం అని మోహన్ రాజా చెప్పుకొచ్చాడు. తాను కథ పై ఫుల్ ఫోకస్ పెట్టాలి అంటే.. హీరోల వర్కింగ్ స్టైల్ కష్టంగా ఉండకూడదు అని, అందుకే హీరోలను మారుద్దాం అని చెప్పి మోహన్ రాజాను ఒప్పించాడట ఎడిటర్ మోహన్.
ఆ విధంగా మోహన్ రాజా కూడా భయపడి.. మోహన్ బాబు – రాజశేఖర్ స్థానంలో అర్జున్, జగపతి బాబులను హీరోలుగా తీసుకున్నాడట. ఇంతకీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే.. మోహన్ బాబు టైం అంటే టైం అంటారు. కానీ రాజశేఖర్ చెప్పిన టైంకి రారు. ఈ ఇద్దరు టైం సెట్ అవ్వదు అని మొత్తానికి హీరోలను మార్చేశారు.