Gautham Ghattamaneni: సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా కాలంగా సామాజిక సేవ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన గోప్యంగా ఉంచారు. గౌతమ్ నెలలు నిండక ముందే జన్మించాడట. దాంతో అతడిని కాపాడుకోవడం చాలా కష్టమైందట. అసలు గౌతమ్ దక్కుతాడో లేడో అని ఆందోళన చెందారట. వైద్యుల కృషితో గౌతమ్ ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డాడట. మనకు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఖరీదైన వైద్యం చేయించి బిడ్డను కాపాడుకున్నాం, పేదల పరిస్థితి ఏంటని ఆయనకు ఆ రోజే ఆలోచన వచ్చిందట.
వెంటనే మహేష్ బాబు ఫౌండేషన్ ఏర్పాటు చేసి గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారులకు ఆపరేషన్స్ చేయిస్తున్నారు. ఇప్పటికి వందల మంది చిన్నారులకు మహేష్ బాబు ఫౌండేషన్ తరపున వైద్యం లభించింది. అలాగే ఏపీ/ తెలంగాణాలలో మహేష్ బాబు రెండు గ్రామాలను దత్తత తీసుకున్నాడు. ఆ గ్రామాలకు అవసరమైన మౌళిక అవసరాలు మహేష్ బాబు తీర్చుతున్నారు. మహేష్ బాబు కొడుకు గౌతమ్ చిన్నప్పటి నుండే ఈ సేవా కార్యక్రమాల పట్ల ఆకర్షితుడు అవుతున్నాడని సమాచారం.
తరచుగా గౌతమ్ హాస్పిటల్స్ ని సందర్శిస్తాడట. అక్కడ మహేష్ బాబు ఫౌండేషన్ తరపున చికిత్స తీసుకుంటున్న చిన్నారి పేషేంట్స్ ని కలుస్తాడట. వాళ్లతో ముచ్చటిస్తాడట. దైర్యం నింపే స్ఫూర్తిదాయక మాటలు చెబుతాడట. స్కూల్ నుండి వచ్చాక రైన్ బో ఆసుపత్రిలో రోగులతో మాట్లాడటం గౌతమ్ కి ఇష్టమైన వ్యాపకమని తల్లి నమ్రతా శిరోద్కర్ వెల్లడించారు. రైన్ బో ఆసుపత్రి సిబ్బందితో, చికిత్స పొందుతున్న రోగులతో గౌతమ్ మాట్లాడుతున్న ఫోటోలు ఆమె షేర్ చేశారు.
ఔదార్యం, సేవలో గౌతమ్ తండ్రిని తలపిస్తున్నాడని పలువురు నెటిజెన్స్ కొనియాడుతున్నారు. మహేష్ దంపతులు పిల్లలను విలువలతో పెంచారని అంటున్నారు. కాగా సితార ఇప్పటికే సెలబ్రిటీ హోదా పట్టేసింది. ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా కూడా చేశారు. అయితే గౌతమ్ సోషల్ మీడియాకు దూరం. ఇటీవల గౌతమ్ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడని అడగ్గా… ప్రస్తుతం చదువుకుంటున్నాడు. దానికి ఇంకా సమయం ఉందని నమ్రత సమాధానం చెప్పారు.