ప్రస్తుతం ఉన్న కరోనా విపత్తు టైంలో తెలుగు సినీ కార్మికులను ఆదుకొనేందుకు మన టాలీవుడ్ అగ్ర తారలు మరియు సినీ పెద్దలు ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి) కి విరాళాలు ఇంకా వస్తూనే ఉన్నాయి. పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ లతో పాటు చిన్న నిర్మాతలు కూడా కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి)కు ఉదారంగా విరాళం ఇస్తున్నారు. ఆ క్రమంలో యువ నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది కూడా రూ .5 లక్షలు విరాళంగా ప్రకటించారు. కాగా సాహు గారపాటి, హరీష్ పెద్ది ఇద్దరూ కల్సి 2019 లో శివ నిర్వాణ దర్శకత్వంలో “మజిలీ” అనే సినిమా తీశారు. నాగ చైతన్య సమంత కలయికలో వచ్చిన ఈ మజిలీ చిత్రం సూపర్ హిట్ రొమాంటిక్ డ్రామాగా ప్రేక్షకుల మన్ననలు పొందింది. కాగా ఇదే బ్యానర్ లో వీళ్లిద్దరు నిర్మాతలుగా ప్రస్తుతం నాని ‘టక్ జగదీష్;’ అనే సినిమా రాబోతుంది.
కాగా కరోనా వ్యాప్తి నిరోధం విషయంలో తెలుగు సినీ వర్గాలు చేస్తున్న ఈ సాయం ఎందరికో స్ఫూర్తి గా నిలుస్తోంది. తమకు తోచిన రీతిలో వారు కూడా సాయపడేందుకు ముందుకు వస్తున్నారు. అంతేకాదు మన తెలుగు హీరోలు ప్రజలను చైతన్యం చేసేందుకు వివిధ వీడియోలను కూడా రూపొందించి మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్లేలా చేస్తున్నారు. మొత్తం మీద ఈ విపత్కర పరిస్థితిని ఇళ్లల్లోనే ఉండి సమష్టిగా ఎదుర్కోవాలి అన్న తెలుగు సినీ పరిశ్రమ ఆశయం చాలా గొప్పది అని చెప్పక తప్పదు.