
తెలంగాణలో ఆర్థిక పరిస్థితిపై కరోనా వ్యాప్తి తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో వ్యయాలు, అవసరాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం చెల్లిస్తున్న వేతనాలన్నింటిలోనూ కోత విధించాలని కేసీఆర్ నిర్ణయించారు.
మార్చి నెల నుంచే కోత వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం వేతనంపై( గ్రాస్ సాలరీ) కోత విధించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తుదపరి ఉత్తర్వులు వచ్చే వరకు కోత అమల్లో ఉంటుందని తెలిపింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సోమవారం ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించిన అనంతరం దీనికి ఆమోదం తెలిపారు. ఈ సమయంలో ప్రభుత్వం ముందుచూపుతో, అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. కోతలుపోను మిగిలిన వేతనాలను విడుదల చేయాలని సీఎం ఆదేశించారు.
ప్రభుత్వ ఉద్యోగుల్లో వివిధ కేటగిరీలకు చెందిన వారి జీతాల్లో నుంచి10 శాతం నుంచి 75శాతం వరకు కోత విధిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు
తెలంగాణలో మొత్తం 4,49,516 మంది ఉద్యోగులున్నారు. ఇందులో ప్రభుత్వ, ఒప్పంద ఉద్యోగులు 4,30,674 మంది. 2.5 లక్షల మంది పింఛనుదారులు ఉన్నారు. ఉద్యోగులు, పింఛనర్లకు జీతభత్యాలు, పింఛన్ల కోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.3,500 కోట్ల మేరకు వెచ్చిస్తోంది. తాజా కోత వల్ల ప్రభుత్వానికి రూ.1,700 కోట్ల మేర ఆదా అవుతాయని అంచనా వేస్తున్నారు.