Homeఆంధ్రప్రదేశ్‌Comedian Ali : అధికారాంతమున.. జగన్మోహన్ రెడ్డికి అలీ అసలైన చిత్రాన్ని చూపించాడు..

Comedian Ali : అధికారాంతమున.. జగన్మోహన్ రెడ్డికి అలీ అసలైన చిత్రాన్ని చూపించాడు..

Comedian Ali : 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కమెడియన్ పృథ్వి, పోసాని కృష్ణ మురళి, అలీ వైసీపీ కార్యకలాపాలలో ఎక్కువగా కనిపించేవారు. పృథ్వీ, పోసాని కృష్ణ మురళి, ఆలీ (తాను ఎటువంటి విమర్శలు చేయలేదని చెబుతుంటారు) సగటు రాజకీయ నాయకుల కంటే ఎక్కువ విమర్శలు చేసేవారు. తరచూ మీడియాలో కనిపించేవారు. ఏదో ఒక వివాదాస్పద అంశాన్ని తెరపైకి తెచ్చేవారు. అయితే కొద్ది రోజులకే వైసీపీలో ఎలాంటి వాతావరణం ఉంటుందో పృథ్వీ కి అర్థమయిపోయింది. ఇంకేముంది బయటికి వచ్చేసాడు. పైగా టీటీడీ పదవిలో ఉన్నప్పుడు.. ఓ వివాదం తెరపైకి వచ్చింది. అంతే తెల్లారే ఆ పదవి పోయింది. వైసిపి కాదు పొమ్మంది. దీంతో ఆయన జనసేనలో చేరారు. ఇటీవల ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు.. ఇక పోసాని కృష్ణ మురళి, అలీ వైసీపీలోనే కొనసాగారు. అలీకి నామినేటెడ్ పోస్ట్ కూడా కేటాయించారు. కొన్నేళ్లపాటు ఆ పోస్టులో కొనసాగాడు అలీ.. ఈలోగా ఎన్నికలు రావడం.. వైసిపి ఓడిపోవడంతో తన పదవికి అలీ రాజీనామా చేశాడు. కానీ యాదృచ్ఛికంగా రాజకీయాలకు కూడా స్వస్తి పలికాడు. ఇదే విషయాన్ని శుక్రవారం ఓ వీడియోలో వెల్లడించాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

2019 ఎన్నికల సమయంలో ఆలీ వైసీపీలో చేరారు. ఆ పార్టీకి సపోర్ట్ చేశారు. కొద్దిరోజుల తర్వాత వైసిపి ప్రభుత్వం ఆయనకు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవి కేటాయించింది. అయితే ఇటీవల ఎన్నికల్లో వైసిపి ఘోరంగా ఓడిపోవడంతో ఆలీ తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు వైసిపి కార్యకర్తలకు దూరంగా ఉండటం మొదలుపెట్టారు. ఇది జరిగిన కొద్ది రోజులకే తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు వీడియో విడుదల చేయడం సంచలనంగా మారింది.. వైసిపికి రాజీనామా చేసి పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉందామని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. “1999లో రామానాయుడు కోరిక మేరకు రాజకీయాలకు వచ్చాను. ప్రేమఖైదీ సినిమాలో ఇచ్చేయండి ఆర్టిస్టుగా నాకు ఆయన అవకాశం ఇచ్చారు. 1999లో బాపట్ల ఎంపీగా రామానాయుడు నిలబడినప్పుడు ఆయన కోసం ప్రచారం చేశాను. ఆ తర్వాత ఇటీవల వైసిపిలో చేరాను. నేను ఏ పార్టీలో ఉన్నప్పటికీ.. ఆ పార్టీ నాయకుడిని మాత్రమే సపోర్ట్ చేశాను. వారికోసం మాత్రమే మాట్లాడాను. ఎవరినీ వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోలేదు. అడ్డగోలుగా మాటలు మాట్లాడి కించపరచలేదు. కాకపోతే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసుకోవచ్చని” అలీ వ్యాఖ్యానించారు..

” 45 సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో ఉన్నాను. నాకు సినీ పరిశ్రమే ఇప్పటికీ అన్నం పెడుతోంది. రాజకీయాలకు స్వస్తి పలికాను కాబట్టి.. పూర్తిస్థాయిలో సినిమాలకే అంకితం అవుతాను. నాకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటాను. నాకు భగవంతుడు దయాగుణం ఇచ్చాడు. దానికి రాజకీయ బలం తోడైతే ప్రజలకు మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించవచ్చని అనుకున్నాను. దానికి తగ్గట్టుగానే నా వంతు పనులు నేను చేశాను. ఇకపై ఏ రాజకీయ పార్టీకి నేను సపోర్ట్ చేయను. ప్రతి ఐదేళ్లకోసారి మీరు ఓటు వేసినట్టే..నేనూ ఓటు వేస్తాను. ఒక సాధారణ వ్యక్తిగా ఉంటానని” అలీ ఆ వీడియోలో పేర్కొన్నారు.

అయితే మొన్నటిదాకా వైసీపీలో యాక్టివ్ గా ఉన్న అలీ ఒకసారిగా ఇలా యూ టర్న్ తీసుకోవడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అప్పట్లో వైసిపికి సపోర్ట్ గా విస్తృతంగా ప్రచారం చేసిన ఆలీ.. అధికారం పోగానే రాజకీయాలకు దూరంగా వెళ్తున్నట్టు ప్రకటించడం వైసిపి వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ” అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించారు. అధికారం పోయిన తర్వాత రాజకీయాలకు దూరంగా జరుగుతున్నారు. ఇటువంటి వారిని జగన్మోహన్ రెడ్డి నమ్మి పూర్తిగా మోసపోయారని” వైసీపీ నాయకులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular