Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మీద నమోదైన కేసును ఏపీ హైకోర్టు కొట్టివేసింది. దాంతో ఏళ్లుగా సాగుతున్న కేసు నుండి ఆయన బయటపడ్డారు. ఆయన మీద నమోదైన కేసును పరిశీలిస్తే… పీఆర్పీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన చిరంజీవి 2014లో ఆ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంటూరులో ఏర్పాటు చేసిన సభను ఆయన నిర్ణీత సమయంలో ముగించలేదు. దీంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. ఎన్నికల కోడ్ ఆయన ఉల్లంఘించారని కేసు నమోదైంది.
తనపై నమోదైన ఈ కేసును కొట్టివేయాలని చిరంజీవి పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిగిన ఏపీ హైకోర్ట్ కేసు కొట్టివేసింది. దాంతో చిరంజీవికి కేసు నుండి ఉపశమనం లభించింది. కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన చిరంజీవి, అనంతరం సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ చిరంజీవి కాంగ్రెస్ లో ఉన్నారని చెబుతుంది. ఆయన మాత్రం అంత క్రియాశీలకంగా లేరు.
రాజకీయాల్లోకి వెళ్లి తప్పు చేశానన్న భావన వ్యక్తం చేస్తారు. ఇకపై నాకు సినిమానే అని ప్రకటించారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి తన మద్దతు ఉంటుందని ఆయన ఒకటి రెండు సందర్భాల్లో వెల్లడించారు. రీఎంట్రీ అనంతరం చిరంజీవి వరుసగా చిత్రాలు చేస్తున్నారు. ఏడాది కాలంగా ఆయన మరింత యాక్టివ్ అయ్యారు. కుర్ర హీరోలను మించి చిత్రాలు చేస్తున్నారు. ఏడాది వ్యవధిలో చిరంజీవి ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య చిత్రాలు విడుదల చేశారు.
వాల్తేరు వీరయ్య మూవీతో సంక్రాంతికి సందడి చేసిన చిరంజీవి భోళా శంకర్ తో సిద్ధమయ్యారు. ఆగస్టు 11న భోళా శంకర్ విడుదలకు సిద్ధంగా ఉంది. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించారు. తమిళ చిత్రం వేదాళం రీమేక్ గా రూపొందించారు. తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లి పాత్ర చేయడం విశేషం. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో అనిల్ సుంకర నిర్మించారు.