Punith Rajkumar: కన్నడ పవర్స్టార్ పునీత్ రాజ్కూమార్ మరణించి ఇప్పటికి నెలరోజులు కావస్తున్నా.. ఆయన మరణవార్తను అభిమానులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ మరమంతో కన్నడ సినీ పరిశ్రమ మూగబోయింది. తీవ్ర దుఖఃంలో మునిగిపోయిింది. కాగా, ఇటీవల బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్లో పునీత్ సంస్మరణ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులతో పాటు, రాజకీయ నాయకులూ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలోనే తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే పునీత్ను గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. పునీత్ బదులు నేను చనిపోయి ఉంటే బాగుండేదని అన్నారు. ఇదే వేదికపై రాజకుమార సినిమా 100రోజుల వేడుక జరిగిందని.. ఇప్పుడు పునీత్కు శ్రద్ధాంజలి జరుపుకోవాల్సి వస్తుందని అనుకోలేదని బాధపడ్డారు. నా శ్రద్ధాంజలికి పునీత్ వస్తాడనుకుంటే.. నేను ఆయన శ్రద్ధాంజలికి రావాల్సి వచ్చిందని కన్నీరు పెట్టుకున్నారు.
కాగా, రాజకుమార సినిమాలో శరత్కుమార్ పునీత్కు తండ్రిగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రికార్డుల వర్షం కురిపించింది. పునీత్ చివరి సినిమా జేమ్స్లోనూ శరత్ కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా పునీత్తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
జిమ్లో వర్క్ఔట్స్ చేస్తుండగా ఛాతి నొప్పితో బాధపడిన పునీత్ వెంటనే ఆసుపత్రిలో చేరారు. అయితే, వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ పునీత్ ప్రాణాలు కాపాడలేకపోయారు. ఆ తర్వాత పునీత్ మరణాన్ని జీర్ణించుకోలేక చాలా మంది అభిమానులు మనస్థాపానికి లోనయ్యారు. కొంతమంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కన్నడలో పునీత్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.