Nuziveedu: ఏపీ ఎన్నికలు చాలామందికి నష్టానికి గురి చేశాయి. పార్టీలపై అభిమానంతో కొందరు, నాలుగు డబ్బులు వెనుకేసుకోవచ్చని మరికొందరు గెలుపు ఓటముల పై బెట్టింగులు కాశారు. ఇందులో చేతులు కాల్చుకున్న వారు ఉన్నారు. అపారంగా నష్టపోయిన వారు ఉన్నారు. ఆస్తులు కోల్పోయిన వారు ఉన్నారు. బెట్టింగులలో 30 కోట్ల రూపాయలు కోల్పోయిన వైసీపీ నేత ఏకంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో వెలుగు చూసింది.ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Rammohan Naidu : రామ్మోహన్ నాయుడు కు రైల్వే శాఖ?
నూజివీడు మండలం తూర్పు దిగవల్లి గ్రామానికి చెందిన జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి స్థానిక వైసిపి నాయకుడు. ఆయన భార్య సర్పంచ్ గా ఉన్నారు. వైసిపి మద్దతుదారులుగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని వేణుగోపాల్ రెడ్డి వివిధ గ్రామాలకు చెందిన వారితో 30 కోట్ల వరకు బెట్టింగ్ కట్టారు. పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఫలితాలు వచ్చిన రోజు ఊరు నుంచి వెళ్ళిపోయారు. ఇంటికి తిరిగి రాలేదు. బెట్టింగ్ కట్టిన వారు ఫోన్లు చేసిన స్పందించలేదు. ఈనెల 7న పందెం కాసినవారు ఆయన ఇంటికి వెళ్లి తలుపులు పగలగొట్టారు. ఏసీలు, సోఫాలు, మంచాలు తీసుకెళ్లిపోయారు. ఆ మరుసటి రోజు ఊళ్లోకి వచ్చిన ఆయన విషయం తెలుసుకొని తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.
Also Read: YS Sharmila : కాంగ్రెస్ ఫండింగ్ పక్క దారి.. షర్మిలపై ఆరోపణలు నిజమేనా?
గత రెండు రోజులుగా వేణుగోపాల్ రెడ్డి తీవ్ర ఒత్తిడికి గురవుతూ వచ్చారు. ఆదివారం పొలం వద్ద పురుగులు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతదేహం వద్ద ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో చింతలపూడి మండలం నామవరానికి చెందిన ఓ వ్యక్తి తన మృతికి కారణమంటూ పేర్కొన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇది ఒక వేణుగోపాల్ రెడ్డి వ్యధ కాదు. చాలామంది బెట్టింగులకు మూల్యం చెల్లించుకున్నారు. ముఖ్యంగా వైసిపి గెలుస్తుందని బెట్టింగ్ వేసిన వారికి భారీగా నష్టాలు తప్పలేదు.