కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్యులకు భారీ ఊరట కలిగే విధంగా కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. పామ్ ఆయిల్, సోయాబిన్ ఆయిల్ లు వాడేవాళ్లకు తక్కువ ధరకే ఇకపై నూనె లభించనుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడటం గమనార్హం. వంట నూనెలపై బేస్ దిగుమతి ధరలను తగ్గిస్తూ మోదీ సర్కార్ ప్రకటన చేసింది.
అంతర్జాతీయ మార్కెట్లో వంట నూనె ధరలు దిగివచ్చిన సంగతి తెలిసిందే. క్రూడ్ పామ్ ఆయిల్ ధర టన్నుకు 1222 డాలర్ల నుంచి 1136 డాలర్లకు తగ్గించిన కేంద్రం క్రూడ్ సోయా ఆయిల్ ధరను టన్నుకు 1452 డాలర్ల నుంచి 1415 డాలర్లకు తగ్గించడం గమనార్హం. కేంద్రం ఆర్బీడీ పామ్ ఆయిల్ ధరను టన్నుకు 1245 డాలర్ల నుంచి 1148 డాలర్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో వంటనూనెల ధరలు మరింత తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.
కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం వంటనూనె ధరలు ఇప్పటికే 20 శాతం వరకు తగ్గాయి. పామాయిల్ ధర కేజీకి మే 7న రూ.142గా ఉండగా ఇప్పుడు రూ.115కు తగ్గింది. సన్ఫ్లవర్ ఆయిల్ ధర మే 5వ తేదీన కేజీ రూ.188 ఉండగా ఇప్పుడు 157 రూపాయలకు తగ్గింది. సోయా ఆయిల్ ధర మే 20న కేజీకి రూ.162 కాగా ప్రస్తుతం కేజీకి రూ.138కు తగ్గింది. ఆవాల నూనె ధర కూడా మే 16న రూ.175 వద్ద ఉండగా ఇప్పుడు రూ.157కు క్షీణించింది.
వనస్పతి ధర రూ.154 నుంచి రూ.141కు తగ్గగా వేరు శనగ నూనె ధర రూ.190 నుంచి రూ.174కు దిగొచ్చింది. వంటనూనెల ధరలు తగ్గడంతో సామాన్యులకు కష్టాలు తగ్గుతున్నాయని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.