YSRCP: డీఎస్సీ నియామక ప్రక్రియపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం అంతా ఇంత కాదు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసింది. ఈ విషయంలో కూటమి ప్రభుత్వంపై నిరుద్యోగుల్లో సానుకూలత ఉంది. దానిని చెడగొట్టేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు. డీఎస్సీ నియామకాలు జరిగిన ఏడాది తర్వాత దానిపై దుష్ప్రచారం చేసింది. ఎన్నెన్నో అనుమానాలను తెర పైకి తీసుకొచ్చి డీఎస్సీ పై విషం చిమ్మే ప్రయత్నం చేసింది. కానీ ప్రభుత్వం విద్యాశాఖ ద్వారా ప్రతి అనుమానాన్ని నివృత్తి చేయడమే కాదు. ఎప్పటికప్పుడు ఫుల్ క్లారిటీ ఇచ్చింది. అయినా సరే వైసిపి ఏదోలా బదనం చేయాలని చూసింది. చివరికి హైకోర్టు ను ఆశ్రయించగా.. అక్కడ కూడా షాక్ తగిలింది.
* హైకోర్టులో పిటీషన్..
డీఎస్సీ ఉపాధ్యాయ నియామక ప్రక్రియను రద్దు చేయాలని కోరుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టులో పిల్ వేశారు. ఈ తీర్పుతో మెగా డీఎస్సీ పై వైసీపీ చేసిన ఆరోపణలన్నీ తేలిపోయాయి. ఒక్క సాక్ష్యం కూడా కోర్టుకు చూపించలేకపోయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ప్రాథమిక ఆధారాలు లేకపోవడంతో కోర్టు ఈ పిటిషన్ కొట్టివేసింది. సుమారు ఏడాది పాటు వారు విధులు కూడా నిర్వహించారు. అయినా సరే తన రాజకీయం కోసం వారిని బలి పీఠంపై ఎక్కించారు జగన్మోహన్ రెడ్డి. కానీ న్యాయస్థానంలో వారి ఆటలు చెల్లలేదు.
* ఎన్నో రకాల కుట్రలు..
మెగా డీఎస్సీ పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేయని కుట్రలంటూ లేవు. చాలా రకాలుగా బురద జల్లి ప్రయత్నం చేశారు. క్రీడల కోట కేటాయింపుల్లో మార్గదర్శకాల ఉల్లంఘన, మెరిట్ జాబితా విడుదల లో పారదర్శకత లోపించిందంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ వచ్చింది. అయితే అన్నింటికీ ప్రభుత్వం ఓపికగా సమాధానం చెబుతూ వచ్చింది. ఓవైపు వైసీపీ చేస్తున్న ఈ విషప్రచారంపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. ఆధారాలుంటే కోర్టుకు వెళ్ళవచ్చు కదా అని ఎక్కువ మంది సూచించారు. అందుకే ఆ పార్టీ ఎమ్మెల్సీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రభుత్వం తరపు న్యాయవాదులు నోటిఫికేషన్ నిబంధనల ప్రకారమే కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, సర్టిఫికెట్ల పరిశీలన పక్కాగా జరిగాయని కోర్టుకు నివేదించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం.. నిరుద్యోగులను అయోమయానికి గురి చేసేందుకు మెగా డీఎస్సీ పై అనుమానాలు సృష్టించే ప్రయత్నం చేసిందని న్యాయస్థానానికి నివేదించారు. దీంతో హైకోర్టు పిటిషన్ కొట్టు వేసింది. దీంతో వైసిపికి షాక్ తగిలినట్లు అయింది.






