YS Vijayamma
YS Vijayamma: కడప ఎంపీ స్థానాన్ని వైసీపీ వదులుకోవాల్సిందేనా? అక్కడ అవినాష్ కు ఓటమి తప్పదా? జిల్లా ప్రజలు కూడా స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారా? ఇప్పుడు విజయమ్మ నేరుగా అడగడంతో కాదనలేకపోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కడప పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల పోటీ చేస్తున్నారు. కడప జిల్లా ప్రజలను గట్టిగానే కోరుతున్నారు. తనను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా కొంగుచాచి అడుగుతున్నానని సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు. ఇప్పుడు నేరుగా విజయమ్మ ప్రత్యేక వీడియోలో కడప జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తన కుమార్తెకు అండగా నిలవాలని కోరారు. ఇప్పుడు విజయమ్మ వీడియో వైరల్ అవుతోంది. వైసిపి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది.
కడప పార్లమెంట్ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ముఖ్యంగా పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో వైయస్ వివేకానంద రెడ్డి ఫ్యాక్టర్ కచ్చితంగా పనిచేస్తుంది. ఇక్కడ వైయస్ అభిమానుల్లో సైతం చీలిక రావడం ఖాయం అన్న ప్రచారం జరుగుతోంది.క్రాస్ ఓటింగ్ కూడా తలెత్తే అవకాశం ఉంది.అసెంబ్లీకి వైసీపీకి వేసినవారు.. పార్లమెంట్ స్థానానికి వచ్చేసరికి షర్మిలకు వేసి అవకాశాలు కనిపిస్తున్నాయి. కడప ఎంపీగా పోటీ చేస్తూ అవినాష్ ను ఓడించి విజయం సాధించాలని పట్టుదలతో షర్మిల ఉన్నారు. వివేక హత్య కేసును ప్రధానంగా ప్రస్తావిస్తూ అవినాష్పై ఆమె మాటల తూటాలు విసురుతున్నారు.
మీ రాజన్న బిడ్డను అడుగుతున్నాను ఆదరించండి అంటూ కడప జిల్లా ప్రజలను షర్మిల కదిలించే ప్రయత్నం చేస్తున్నారు.ఆమెకు ఇప్పుడు వైయస్ కుటుంబ సభ్యులు తోడయ్యారు.ఇప్పటికే సునీత ఒకవైపు,ఆమె తల్లి సౌభాగ్యమ్మ మరోవైపు షర్మిలకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు పోలింగ్నకు 24 గంటల ముందు విజయమ్మ విదేశాల నుంచి ఒక ప్రత్యేక వీడియో విడుదల చేశారు. నా కుమార్తెకు అండగా నిలిచి ఓటు వేయండి అని విజ్ఞప్తి చేశారు. ఇది తప్పకుండా కడప జిల్లా ప్రజల్లో ప్రభావితం చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పులివెందులలో జగన్ కు ఓటు వేసే జనాలు.. పార్లమెంట్ స్థానానికి వచ్చేసరికి షర్మిలకు ఓటు వేయడం ఖాయంగా కనిపిస్తోంది. పులివెందులలో అవినాష్ కంటే షర్మిలకే ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అటు జమ్మలమడుగులో సైతం అదే సీన్ రిపీట్ కానుంది. ఈ లెక్కన అవినాష్ రెడ్డి కడప లోక్సభ సీటు విషయంలో ఆశలు వదులుకోవాల్సిందేనన్న టాక్ ప్రారంభమైంది.