YS Jagan Mohan Reddy ABN row: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి భారీ శపథం చేశారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిస్తానని హెచ్చరించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసిపి సమన్వయ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి తన మావిగన్ తో పాటు ఆంధ్రజ్యోతి ఎండి ఎపిసోడ్ పై మాట్లాడారు. వైయస్సార్ కుటుంబ మహిళలపై అలా మాట్లాడుతారా.. అటువంటి వ్యాఖ్యలు చేస్తారా.. అనే కంటెంట్ చుట్టూ జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ సాగాయి. ఎట్టి పరిస్థితుల్లో రాధాకృష్ణను విడిచి పెట్టేది లేదని కూడా తేల్చి చెప్పారు. అయితే ఒకసారి గతాన్ని పరిశీలిస్తే జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి ఓ ఆరేళ్ల పాటు అధికారంలో ఉండేవారు. జగన్మోహన్ రెడ్డి సైతం ఐదేళ్లు అధికారంలో ఉన్నారు. కానీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను మాత్రం టచ్ చేయలేకపోయారు.
ప్రభుత్వంపై వ్యతిరేక కథనాలతోనే..
రాధాకృష్ణ ఒక మీడియాను నడుపుతున్నారు. ఆంధ్రజ్యోతితో ( Andhra Jyothi )పాటు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ను నడుపుతున్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే ఆంధ్రజ్యోతి 2004 తర్వాత విశ్వరూపం చూపింది. 2001లోనే ఆంధ్రజ్యోతి సంస్థను దక్కించుకున్నారు రాధాకృష్ణ. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వ్యతిరేక మీడియా గానే ముద్ర ఉండేది. అలా 2014 వరకు ఆంధ్రజ్యోతి ప్రభుత్వ వ్యతిరేక ముద్ర మూటగట్టుకుంది. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు అధికారంలో ఉన్నారు. 2019 నుంచి 2024 మధ్య జగన్ ఉన్నారు. 2024లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అంటే ఎక్కువ కాలం ఆంధ్రజ్యోతిని వ్యతిరేకించే ప్రభుత్వాలు ఉండేవి. అప్పుడే ఏం చేయలేకపోయాయి. మళ్లీ ఇప్పుడు జగన్ అధికారంలోకి రావాలి. ఆంధ్రజ్యోతి తప్పులను వెతకాలి. రాధాకృష్ణ ను పోలీస్ స్టేషన్లలో తిప్పాలి.
రామోజీరావు పై ఇదే మాదిరిగా..
రామోజీరావు విషయంలో ఇలాంటి పగటి కలలే కన్నారు జగన్మోహన్ రెడ్డి. ఒక్క రోజు అయినా జైల్లో వేయాలని చూసారు. కానీ అది వీలుపడలేదు. చివరకు పోలీసులు వెళ్లి రామోజీరావు ఇంట్లోనే ఆయనను దర్యాప్తు చేశారు. అంతకుమించి ఏమీ చేయలేకపోయారు. ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై ( Radha Krishna)దేశద్రోహం కేసు కూడా పెట్టాలని చూసారు. అది వీలుపడలేదు. అయితే ఇప్పుడు పార్టీ నేతలతో బలవంతంగా హైదరాబాదులోని ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట ధర్నా చేయించారు. ఈరోజు స్వయంగా జగన్మోహన్ రెడ్డి రాధాకృష్ణను స్టేషన్లకు తిప్పుతానని హెచ్చరించారు. సైలెంట్ గా రివెంజ్ తీర్చుకోవాలి తప్ప.. ఇలాంటి మాటలు ఎంత మాత్రం ఉపకరించవు. ఇంకా మూడేళ్ల పాటు కూటమి అధికారంలో ఉంటుంది. బహుశా తన సొంత మీడియా ఉంది కాబట్టి ఇలాంటి మాటలు చెప్పి ఉండవచ్చు. కానీ ఆంధ్రజ్యోతి ఎప్పుడు తనతో పాటు తన పార్టీకి వ్యతిరేకం అనే విషయాన్ని గుర్తించాలి. పైగా స్టేషన్లను తిప్పుతాను అంటూ చెప్పడం చూస్తుంటే.. జగన్లో ఉండే ఫ్రస్టేషన్ ఇట్టే బయటపడుతుంది.