YS Jagan : వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) అధినేతకు నాయకులు సాష్టాంగ నమస్కారాలు చేస్తారా? అందులో ఎంత నిజం ఉంది? ఆయన ఎదురుగా నేతలు ఎవరు కూర్చోరా? ఎంతటి వారైనా నిలబడాల్సి ఉండాల్సిందేనా? సార్ అని సంబోధించాలా? ఇలా గత రెండు రోజులుగా ఒక ప్రచారం బలంగా నడుస్తోంది. సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు సందర్భంగా.. జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన ప్రధానంగా వచ్చింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు అయితే జగన్మోహన్ రెడ్డిని సార్ అని పిలవకపోవడం వల్లే తాను ఆయనకు దూరమయ్యానని చెప్పడం సంచలనంగా మారింది. మరో మంత్రి వాసంశెట్టి సుభాష్ అయితే తాను ఎమ్మెల్సీ పదవి కోసం జగన్మోహన్ రెడ్డిని కలవాలనుకుంటే.. సాష్టాంగ నమస్కారం చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారని తాజాగా ఆయన వెల్లడించారు. అయితే చంద్రబాబు జన్మదినం నాడు జగన్మోహన్ రెడ్డి పై టిడిపి నేతలు ఇలా సంచలన వ్యాఖ్యలు చేయడం విశేషం.
Also Read : ఆ జిల్లాపై జనసేన ఫోకస్.. వైసీపీ నుంచి మాజీ మంత్రి ఔట్!
* కూటమిలో నో ఛాన్స్..
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మీయ ఆలింగనాలు మాత్రమే కొనసాగుతూ వచ్చాయి. సీఎం చంద్రబాబు ఈ సాష్టాంగ నమస్కారాలకు అవకాశం ఇవ్వడం లేదు. మంత్రుల ప్రమాణ స్వీకార సమయంలో సైతం చాలామంది సాష్టాంగ నమస్కారాలు పెట్టేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ఎవరికి అవకాశం ఇవ్వలేదు. అటు తరువాత జిల్లాల పర్యటనల్లో సైతం ఎవరైనా నేతలు నమస్కారానికి ప్రయత్నిస్తే చంద్రబాబు సైతం వారికి తిరిగి నమస్కారాలు పెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఈ నమస్కారాలను ప్రధాని మోదీ బ్రేక్ వేశారు. అటు తరువాత చంద్రబాబు దానినే కొనసాగించారు. పవన్ కళ్యాణ్ సైతం దానిని కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చర్చకు రావడానికి ప్రధాన కారణం టిడిపి నేతలు. అయితే జగన్మోహన్ రెడ్డిని డ్యామేజ్ చేసేందుకు ఈ ప్రయత్నం అని వైసిపి ఆరోపిస్తోంది. కాదు కాదు ఇది నిజం అని టిడిపి కూటమి చెబుతోంది.
* అప్పట్లో ప్రమాణ స్వీకార సమయంలో..
2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. 151 స్థానాలతో సూపర్ విక్టరీ కొట్టింది. ఆ సమయంలో మంత్రులుగా ప్రమాణం చేసిన 25 మందిలో ఒకరిద్దరు తప్ప అంతమంది జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) కాలికి నమస్కారం చేశారు. అవకాశం లేని సీనియర్లు ఆయన చేయిని పట్టుకొని.. నమస్కారం చేసినంత పని చేశారు. అయితే ఇప్పుడు టిడిపి నేతలు దానిని గుర్తు చేస్తూ.. గత ఐదేళ్లలో నేతలకు పదవులు, అవకాశాలు దక్కాలంటే జగన్మోహన్ రెడ్డికి సాష్టాంగ నమస్కారం పెట్టాల్సిందేనని ప్రచారం ప్రారంభించారు. అయితే గత ఐదేళ్ల పరిణామాలు, జగన్మోహన్ రెడ్డి విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ నేతలు వ్యవహరించిన తీరు మాత్రం భిన్నంగా కనిపిస్తూ ఉంటుంది. అధినేత చిన్నవాడైనా.. విధేయతకు పెద్దపీట వేస్తూ నేతలు కనిపించేవారు. అన్నింటికీ మించి అధినేత పట్ల భయంతో గడిపిన నేతలు కూడా ఉన్నారు. అందుకే ఇప్పుడు టిడిపి నేతలు ధైర్యంగా ఆరోపణలు చేయగలుగుతున్నారు.
* రఘురామకృష్ణం రాజు కుటుంబ సన్నిహిత నేత..
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు( raghuramakrishna Raju ) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొద్దికాలం పాటు ఉన్నారు. ఆయన రాజశేఖర్ రెడ్డి కి సన్నిహితంగా మెలిగే వారు. రాజశేఖర్ రెడ్డి ఆత్మగా పరిగణించే కేవీపీ రామచంద్రరావుకు వియ్యంకుడు కూడా. అయితే తండ్రితో ఉన్న చనువును కుమారుడు జగన్ నుంచి కూడా కోరుకున్నారు. కానీ ఆయన నుంచి ఆ చనువు దక్కలేదు. అందుకే ఇప్పుడు రఘురామకృష్ణం రాజు జగన్మోహన్ రెడ్డి విషయంలో సంచలన ఆరోపణలు చేశారు. సార్ అని సంబోధించలేక తాను దూరమయ్యానని చెప్పుకొస్తున్నారు. అయితే వాసంశెట్టి సుభాష్ ( vasam Shetty Subhash )విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మంత్రిగా ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోతున్నారని.. చంద్రబాబు ప్రాపకం కోసమే జగన్మోహన్ రెడ్డి పై సాష్టాంగ నమస్కారాల వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరి ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియాలి.
Also Read : చంద్రబాబుతో పని చేయడం అదృష్టం.. వైసిపి మాజీ నేత సంచలనం!