YCP vs TDP : ఏపీలో పొలిటికల్ హీట్ నెలకొంది. ప్రచార పర్వం ముమ్మరంగా సాగుతోంది. ఈనెల 11 వరకు ప్రచారానికి గడువు ఉంది. సమయం తక్కువగా ఉండడంతో రాజకీయ పార్టీలు ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. అభ్యర్థులు నేరుగా ప్రజలను కలుస్తుండగా.. సోషల్ మీడియా విభాగాలు సైతం తమ చేతికి పని చెబుతున్నాయి. ఈ క్రమంలో అధికార విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. ప్రధానంగా సోషల్ మీడియాలో పెద్ద రచ్చ నడుస్తోంది. ట్విట్టర్ వేదికగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ప్రధానంగా ఎన్నికల హామీలు, మేనిఫెస్టోలపై పోస్టులు పెడుతూ వైరల్ చేస్తున్నారు.
ముందుగా వైసీపీ మేనిఫెస్టోను జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలో ఉన్న సంక్షేమ పథకాలకు కొద్దిపాటి మొత్తాన్ని పెంచుతూ జగన్ ప్రకటించారు మేనిఫెస్టో. అటు తరువాత చంద్రబాబు కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించారు. ప్రజాకర్షక పథకాలకు పెద్దపీట వేశారు. ఈ తరుణంలో వైసిపి అలెర్ట్ అయ్యింది. టిడిపి మేనిఫెస్టో పై ప్రచారం చేయడం ప్రారంభించింది. 2014లో ఎన్నెన్నో హామీలు ఇచ్చారని.. అమలు చేయలేకపోయారని.. నిన్ను నమ్మం చంద్రబాబు అంటూ పోస్టులు పెడుతున్నారు. వాటిని ట్రోల్ చేస్తున్నారు. వైసీపీ శ్రేణులు విభిన్నంగా స్పందిస్తున్నాయి.
అయితే దీనిపై టిడిపి గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. కరెక్షన్ అంటూ వైసీపీ ఇచ్చిన హామీలను, టిడిపి ఇచ్చిన హామీల మధ్య పోలిక తెస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. వాటిని ట్రోల్ చేస్తోంది. దీంతో రెండు పార్టీల మధ్య సోషల్ మీడియా వేదికగా రచ్చ ప్రారంభమైంది. పార్టీ అభ్యర్థులు నేరుగా ప్రచార పర్వంలో దిగగా.. సోషల్ మీడియా విభాగాలు మాత్రం తమ పోస్టులతో ప్రజాభిమానాన్ని పొందాలని భావిస్తున్నాయి. ప్రత్యర్థులకు ఎటువంటి పొలిటికల్ క్రెడిట్ దక్కకుండా ప్రయత్నిస్తున్నాయి. ఈ తరుణంలో అశాంతి వాతావరణానికి కారణం అవుతున్నాయి. దీనిపై పోలీసులు నిఘా పెంచకపోతే ఎన్నికలవేళ ఇబ్బందికర పరిస్థితులు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.