Pawan Kalyan
Pawan Kalyan: తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల సంగ్రామం ముగిసింది. ఏపీలో 25 లోక్సభ స్థానాలతోపాటు 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఓటర్లు వెల్లువలా పోలింగ్ బూత్లకు తరలి వచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు. పెరిగిన పోలింగ్ ఎవరికి లాభిస్తుందని అన్నది ఇటూ అధికార వైసీపీని, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని టెన్షన్ పెడుతుంది. అయితే ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. అయితే, అన్నీ ఒక ఎత్తు అయితే.. పిఠాపురం ఎన్నిక ఒక ఎత్తు అన్నట్లుగా జరిగింది. ఇక్కడి నుంచి కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.
వర్మ త్యాగం..
దశాబ్దకాలంగా ఎలాంటి రాజకీయం బలం లేకుండా, చట్ట సభల్లో పదవులకు ఆశపడకుండా, ఓటమి ఎదురైనా అధైర్య పడకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ముందుకు సాగారు జనసేనాని పవన్ కళ్యాణ్. వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి తరఫున పిఠాపురం నుంచి బరిలో దిగారు. పవన్ కోసం 20219 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన టీడీపీ బలమైన నేత వర్మ జనసేనాని కోసం సీటు త్యాగం చేశారు. 2024 ఎన్నికల్లో పోటీకి గ్రౌండ్ వర్క్ చేసుకున్నప్పటికీ చంద్రబాబు నిర్ణయంతో పోటీ నుంచి తప్పుకుని పవన్కు మద్దతు తెలిపారు.
ఓటు బదిలీ అయిందా..
పిఠాపురంలో కూటమి కోసం వర్మ త్యాగం చేసినా.. టీడీపీ ఓటు బదిలీ అయిందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రజలు పవన్ను ఆశీర్వదించారని వర్మతోపాటు కూటమి నేతలు చెబుతున్నారు. అయితే లాస్ట్ పంచ్ మనది అయితే అ కిక్కే వేరప్ప అని పవన్ చెప్పినట్లుగానే సీఎం జగన్ ప్రచారంలో భాగంగా ఎన్నికలకు రెండు రోజుల ముందు చివరి సభ పిఠాపురంలోనే నిర్వహించారు. వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంను చేస్తానని ప్రకటించారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురంపై పడింది.
వర్మ మాట నిలబెట్టుకున్నారని..
మరోవైపు టీడీపీ ఓట్లు జనసేనకు బదిలీ అయ్యాయని వర్మ చెబుతున్నారు. 90 శాతం ఓట్లు జనసేనకు పడ్డాయంటున్నారు. వంగా గీతను పిఠాపురం ప్రజలు తిరస్కరించారని చెబుతన్నారు. ఆమెను పోలింగ్ కేంద్రాల్లోకి కూడా అనుమతించలేదని పేర్కొంటున్నారు. వైసీపీ తరఫున పిఠాపురంలో పోలింగ్ ఏజెంట్లు కూడా లేరని పేర్కొన్నారు. వంగా గీత ఓటమి ఖరారయిందని వెల్లడించారు. బాబుకి ఇచ్చిన మాటకు కట్టుబడి, పవన్ తనపై పెట్టిన బాధ్యతకు తలవంచి జనసేన గెలుపు కోసం వర్మ శ్రమించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. మరి పిఠాపురం ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే జూన్ 4 వరు వేచి ఉండాలి.