Homeఆంధ్రప్రదేశ్‌Kiran Kumar Reddy: కిరణ్ కుమార్ రెడ్డి ఎరక్కపోయి ఇరుక్కున్నారా?

Kiran Kumar Reddy: కిరణ్ కుమార్ రెడ్డి ఎరక్కపోయి ఇరుక్కున్నారా?

Kiran Kumar Reddy: మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ధైర్యం ఏంటి? రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి ఆయన గట్టెక్కగలరా? ఆయన ఏరి కోరి అక్కడే బరిలో దిగారు ఎందుకు? తప్పనిసరి పరిస్థితుల్లో పోటీ చేస్తున్నారా? లేకుంటే చిరకాల ప్రత్యర్థిని మట్టి కరిపించాలని చూస్తున్నారా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఉమ్మడి రాష్ట్రానికి మూడు సంవత్సరాల సీఎం గా పని చేసిన నేత.. ఇప్పుడు ఎంపీగా బరిలో దిగడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి కావాలనుకుంటున్నారా? లేకుంటే పెద్దిరెడ్డి ఆధిపత్యానికి గండి కొట్టాలని చూస్తున్నారా? అన్నది తెలియాల్సి ఉంది.

చిత్తూరు జిల్లాలో నల్లారి అమర్నాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి రాజకీయంగా విభేదాలు ఉన్నాయి. ఈ రెండు కుటుంబాలు పీలేరు కేంద్రంగా చేసుకొని రాజకీయాలు నడిపాయి. ఈ రెండు కుటుంబాలు ఒకే పార్టీలో ఉన్నా.. వీరికి అస్సలు పడేది కాదు. ఉమ్మడి రాష్ట్రంలో అనూహ్యంగా కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి దక్కింది. వైసీపీలో చేరిన పెద్దిరెడ్డి కుటుంబం రాయలసీమలో పట్టు బిగించింది. పెద్దిరెడ్డి సోదరుడు, కుమారుడు చట్టసభలకు హాజరయ్యారు. అటు జగన్ సైతం ఫుల్ పవర్స్ ఇచ్చి పెద్దిరెడ్డిని శక్తివంతుడిగా తీర్చిదిద్దారు.

రాష్ట్ర విభజన తరువాత కిరణ్ కుమార్ రెడ్డి కొద్దిరోజులపాటు రాజకీయాలకు దూరమయ్యారు. బిజెపిలో చేరి ఇప్పుడు రాజంపేట అభ్యర్థిగా మారారు. అయితే రాజంపేట సీటును తీసుకోవడం వెనుక వ్యూహం ఏమిటన్నది తెలియాల్సి ఉంది. నాలుగు దశాబ్దాల రాజంపేట పార్లమెంట్ స్థానం చరిత్రను గమనిస్తే.. 13 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో తొమ్మిది సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. గత రెండు ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి మిథున్ రెడ్డి గెలుపు పొందుతూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మాత్రం 1999లో మాత్రమే గెలిచింది. పొత్తులో భాగంగా అటువంటి సీటును కిరణ్ కుమార్ రెడ్డి తీసుకోవడం సాహసమనే చెప్పాలి.

రాజంపేట పార్లమెంట్ స్థానం పరిధిలో పుంగనూరు, పీలేరు, మదనపల్లి,తంబళ్లపల్లి, రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఈ ఏడింట వైసిపి స్వీప్ చేసింది. ఎంపీ స్థానంలో అయితే మిధున్ రెడ్డి 2.70 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అటువంటి నియోజకవర్గంలో కిరణ్ కుమార్ రెడ్డి ఏ ధైర్యంతో పోటీ చేస్తున్నారో తెలియడం లేదు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఈ నియోజకవర్గాలకు కిరణ్ పెద్ద ఎత్తున నిధులు సమకూర్చారు. పైగా వైసీపీలో ఉన్న కీలక నేతలంతా.. అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి అనుచరులే. ప్రస్తుతం ఈ జిల్లాతో పాటు రాయలసీమను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శాసిస్తున్నారు. అది మింగుడు పడని చాలామంది నాయకులు కిరణ్ కు సహకారం అందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కిరణ్ గెలిస్తే మాత్రం కేంద్రంలో మంత్రి పదవి ఖాయంగా తెలుస్తోంది. ఆ ఒప్పందంతోనే కిరణ్ రాజంపేట నుంచి పోటీ చేస్తున్నట్లు సమాచారం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular