Chandrababu: జగన్ మేనిఫెస్టో ప్రకటించిన తరువాత తెలుగుదేశం పార్టీ ముప్పేట దాడి పెంచింది. మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత అని చెప్పారు కదా? అంటూ ప్రశ్నించడం ప్రారంభించింది. గత ఎన్నికల్లోజగన్ నవరత్నాలను ప్రకటించారు.కానీ కొన్ని అమలు చేయలేకపోయారు. సంపూర్ణ మద్య నిషేధం, ఏటా జాబ్ క్యాలెండర్లు, సిపిఎస్ రద్దు, పరిశ్రమల ఏర్పాటు వంటి విషయంలో వైఫల్యం చెందారు. కానీ అదే సమయంలో గత ఎన్నికల్లో ఇవ్వని హామీలను సైతం అమలు చేసి చూపించారు. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేశారు. అయితే ఇప్పుడు తాజాగా మేనిఫెస్టో ప్రకటించారు. గతంలో ప్రకటించిన మేనిఫెస్టో నే అమలు చేయలేకపోయారు.. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తారు అంటూ టిడిపి ప్రశ్నిస్తోంది. దీనిపై వైసీపీ సైతం ఎదురుదాడి చేస్తోంది.
2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున హామీలు ఇస్తూ మేనిఫెస్టోను ఎన్నికల్లో ప్రకటించారు. విభజిత రాష్ట్రం, ఆపై ఎన్నో చిక్కుముడులు ఉంటాయని భావించిన యువత అనుభవజ్ఞుడైన చంద్రబాబుకు మద్దతు తెలిపారు. కానీ నాడు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయలేకపోయారు. ఎన్నెన్నో నాడు యువతకు భ్రమలు కల్పించారు. వాటన్నింటినీ అమలు చేయకపోగా.. కేంద్రాన్ని ఒప్పించి ప్రత్యేక హోదా తీసుకొస్తానని కూడా హామీ ఇచ్చారు. అటు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు సరి కదా.. కేంద్రం నుంచి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ.. అంటూ లేనిపోని గందరగోళాన్ని సృష్టించారు. చివరకు కేంద్ర ప్రభుత్వానికి దూరమయ్యారు. కేంద్రం నుంచి ఎటువంటి సాయం రాకుండా చేసుకున్నారు.
2014 ఎన్నికల్లో టిడిపి ప్రధాన నినాదం నిరుద్యోగ భృతి. డిగ్రీ చదివిన ప్రతి నిరుద్యోగ యువతకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తానని నాడు చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ అమలు చేయలేకపోయారు. ప్రతి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు శిక్షణను ఇస్తానని చెప్పుకొచ్చారు. కానీ కొన్ని జిల్లాలకి పరిమితం చేశారు. ప్రతి ప్రభుత్వ కాలేజీలో నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి.. యువతకు ఉపాధి శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.కానీ ఒక్క కాలేజీలో కూడాఏర్పాటుచేసిన దాఖలాలు లేవు. అయితే నాడు యువతకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలుకు నోచుకోలేదు. అది గుర్తు లేదన్నట్టు.. ఇప్పుడు జగన్ ప్రకటించిన మేనిఫెస్టో పై టీడీపీ నేతలు పడటం గులివింద సామెతను గుర్తు చేస్తోంది.