Homeఆంధ్రప్రదేశ్‌AP BJP: కాపులను పక్కన పెట్టిన బిజెపి.. అసలు కారణం ఏంటి?

AP BJP: కాపులను పక్కన పెట్టిన బిజెపి.. అసలు కారణం ఏంటి?

AP BJP: ఎన్నికల్లో కాపు అంశం ప్రధానంగా మారింది. ప్రతి ఎన్నికల్లోనూ ఇది కనిపిస్తోంది. కాపులు ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే వారు అధికారంలోకి వస్తారు. అందుకే అన్ని పార్టీలు కాపులను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తాయి. గత ఎన్నికల్లో కాపులు వైసీపీ వైపు వెళ్లారు. ఈసారి మాత్రం జనసేన వైపు నడిచే అవకాశం ఉంది. ఆ పార్టీ కూటమిలో ఉండడంతో మిగతా భాగస్వామ్య పార్టీలకు ఓట్ల బదలాయింపు జరుగుతుందా? లేదా? అన్నది చూడాలి. కూటమిలో జనసేనతో పాటు టిడిపి కాపులకు ప్రాధాన్యం ఇచ్చాయి. కానీ అదే కూటమిలో ఉన్న బిజెపి మాత్రం కాపులను కనీస పరిగణలోకి తీసుకోలేదు. ఆ సామాజిక వర్గానికి టిక్కెట్లు కేటాయించలేదు. అటు పార్లమెంటు సీట్లలో కానీ.. తాజాగా ప్రకటించిన అసెంబ్లీ సీట్లలో ఒక్క కాపు అభ్యర్థిని కూడా ప్రకటించలేదు.

భారతీయ జనతా పార్టీ గతంలో కాపులకు అత్యంత ప్రాధాన్యమిచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ వైపు రెడ్డి సామాజిక వర్గం, తెలుగుదేశం పార్టీ వైపు కమ్మ సామాజిక వర్గం మొగ్గు చూపిన సంగతి తెలిసిందే. అయితే తెలుగుదేశం పార్టీతో బిజెపి గతంలో పొత్తు పెట్టుకున్న సమయంలో.. కాపులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. కాపు సామాజిక వర్గం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లోనే బిజెపి ఎదిగింది. ఆ సామాజిక వర్గానికే రాష్ట్ర బాధ్యతలను అప్పగించింది. రాష్ట్ర విభజన వరకు అదే ఫార్ములాను అనుసరించింది. తెలంగాణకు బండి సంజయ్ ను, ఏపీకి సోము వీర్రాజును నియమించింది.

అయితే ఇటీవల తన ఆలోచనను డైవర్ట్ చేసింది. కాపులకు బిజెపిలో ప్రాధాన్యం తగ్గిపోయింది. తెలంగాణలో బండి సంజయ్ ను తప్పించింది. కిషన్ రెడ్డికి రాష్ట్ర పగ్గాలు అప్పగించింది. ఏపీలో సైతం సోము వీర్రాజును తప్పించి.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన పురందేశ్వరిని నియమించింది. ఈ ఎన్నికల్లో ఒక్కచోట కూడా కాపులకు టిక్కెట్లు ఇవ్వలేదు. 10 అసెంబ్లీ స్థానాలతో పాటు ఆరు పార్లమెంట్ స్థానాలకు.. ఒక్కరంటే ఒక్క కాపు అభ్యర్థిని సైతం ప్రకటించలేదు. భాగస్వామ్య పక్షాలుగా ఉన్న టిడిపి ఎనిమిది మంది కాపులకు టికెట్లు ఇచ్చింది. జనసేన సైతం పదిమంది కాపు నేతలకు టికెట్లు ప్రకటించింది. ఇంకా ఆ రెండు పార్టీలు మరో తొమ్మిది స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అదే సమయంలో వైసీపీ సైతం కాపులకు 22 టిక్కెట్లు ఇచ్చింది. అయితే అన్ని పార్టీలు ప్రాధాన్యమిస్తున్నా బిజెపి మాత్రం కాపులను విస్మరించడం ఆ వర్గంలో ఆగ్రహానికి కారణమవుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular