CM Jagan: ఏపీలో ఎన్నికల ప్రచారపర్వం ఊపందుకుంటుంది. జగన్ మేమంతా సిద్ధం పేరిట రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపడుతున్నారు. కడప జిల్లాలో యాత్రకు శ్రీకారం చుట్టారు. అటు చంద్రబాబు ప్రజాగళం పేరిట ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. రోజుకు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఈనెల 30 నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. అయితే నేతలు పరస్పర విమర్శలతో రాజకీయాన్ని హీటెక్కిస్తున్నారు. కానీ జాతీయ పార్టీల విషయంలో విభిన్నంగా స్పందిస్తున్నారు. భిన్న వైఖరిని ప్రదర్శిస్తున్నారు.
మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు, పవన్ లతో ప్రధాని మోదీ వేదిక పంచుకున్నారు. జగన్ పై ప్రధాని మోదీ సున్నిత విమర్శలకే పరిమితమయ్యారు. జగన్ క్యాబినెట్లో మంత్రులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్డీఏ ఓట్లు చీల్చేందుకు అన్నా చెల్లెలు ప్రయత్నాలు చేస్తున్నారని జగన్, షర్మిలపై ఆరోపణలు చేశారు. అంతకుమించి ఏమీ అనలేదు. జగన్ కేసుల గురించి గానీ, తమ వద్ద సాగిలాలు పడ్డారని కానీ… ఎటువంటి ఆరోపణలు చేయలేదు.అయితే ఇది తెలుగుదేశం, జనసేన లకు నిరాశకు గురి చేసే అంశమే.
రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపడుతున్న జగన్ సైతం ప్రధాని మోడీ విషయంలో ఆచితూచి మాట్లాడుతున్నారు. సున్నితమైన విమర్శలే చేస్తున్నారు. అందరూ జతకట్టి వస్తున్నారని.. ఆచరణ సాధ్యం కానీ మేనిఫెస్టోను రూపొందించే పనిలో పడ్డారని మాత్రమే ఆరోపణలు చేశారు. ఎక్కడ ప్రధాని మోదీ ప్రస్తావన లేకుండా.. కేవలం చంద్రబాబుతో పాటు పవన్ లను టార్గెట్ చేసుకున్నారు. ఈ రాష్ట్రానికి బిజెపి అన్యాయం చేసిందని కానీ.. ప్రధాని మోదీ వంచించారని కానీ ఆరోపణలు చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వ ప్రస్తావన కూడా తేవడం లేదు. గత ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు ప్రధాని మోదీని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్నారు. దాని పర్యవసానాలు జగన్ కు తెలుసు. అందుకే ప్రధాని మోదీ జోలికి పోవడం లేదు. ఆయనపై ఎటువంటి విమర్శలు చేయడం లేదు.
అయితే మరోవైపు ఎన్డీఏతో జత కట్టిన చంద్రబాబు కాంగ్రెస్ పై ఎటువంటి విమర్శలు చేయడం లేదు. కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిందన్న ఆరోపణ ఆయన నోటి నుంచి వినిపించడం లేదు. అదే సమయంలో జగన్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుంటున్నారు. ఈ రాష్ట్రానికి అన్యాయం చేయడంలో కాంగ్రెస్ ప్రధాన పాత్ర పోషించిందని ఆరోపించారు. అయితే ఇటు జగన్ బిజెపి పై, చంద్రబాబు కాంగ్రెస్ పై విమర్శలు చేయకపోవడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. అనవసరంగా జాతీయ పార్టీలను కెలికి చేతులు కాల్చుకోవడం ఇబ్బందికరమని వారి భావిస్తున్నారు. అందుకే సంయమనం పాటిస్తున్నారు.