Veligonda Project: దశాబ్దాల కల ఆవిష్కృతం అయ్యింది. కరువు నేలపై జలసిరులు పొంగిపొర్లే సమయం వచ్చేసింది.. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధం అయ్యింది. మరికొద్ది సేపట్లో సీఎం చంద్రబాబు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు. మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలంలోని గంటవాని పల్లె సమీపంలో ప్రాజెక్టును ప్రారంభిస్తారు సీఎం చంద్రబాబు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం నేపథ్యంలో సీఎం చంద్రబాబు తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రజలకు ఆహ్వానం పలికారు. మూడు దశాబ్దాల నిరీక్షణకు ఇది ముగింపు అని.. మూడు జిల్లాల్లో లక్షల మంది ప్రజల భవిష్యత్తుకు తొలి అడుగు అని.. 30 ఏళ్లుగా కరువు పీడిత ప్రాంత ప్రజలు కంటున్న వెలిగొండ కల.. కృష్ణమ్మ జలాలతో కళ్ళ ముందు నిజం కాబోతోంది.. కరువుతో అల్లాడుతున్న పశ్చిమ ప్రకాశం ప్రజల కష్టాలు తీర్చాలన్న సంకల్పంతో 1996లో మొదలుపెట్టిన ప్రాజెక్టు మొదటి దశను పూర్తి చేసి ప్రారంభిస్తున్నాం అంటూ చంద్రబాబు నిన్ననే భావోద్వేగంతో కూడిన ట్విట్ చేశారు.
* చంద్రబాబు మూలం..
ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించింది.. ఇప్పుడు ప్రారంభోత్సవం చేస్తోంది చంద్రబాబు కావడం గమనార్హం. దాదాపు 30 ఏళ్ల కిందట.. 1996 మార్చి 5న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు శంకుస్థాపన చేశారు. మూడు దశాబ్దాల సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ ఆయన చేతుల మీదుగానే తొలి దశ ప్రారంభం ఉండడం ఒక అరుదైన చారిత్రక ఘట్టం. వెలిగొండ జలసిరులు – అభివృద్ధికి రెక్కలు అనే నినాదంతో ప్రభుత్వం ఈ ప్రారంభోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తోంది. శ్రీశైలం జలాశయం నుంచి గ్రావిటీ ద్వారా కృష్ణా వరద జలాలను తరలించి నల్లమల సాగర్ లో నిల్వచేసి.. ప్రధాన కాలువల ద్వారా సాగు, తాగునీటికి వినియోగించేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దారు.
* వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభం ద్వారా 10.70 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమల సాగర్ కు విడుదల చేయనున్నారు. దీని ద్వారా తొలి విడతలో 1.19 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు నాలుగు లక్షల మంది ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందనుంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి అందుబాటులోకి వస్తే నాలుగు జిల్లాల్లోని 30 మండలాల పరిధిలో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు లభిస్తుంది. ముఖ్యంగా తీవ్ర ఫ్లోరైడ్ సమస్యలతో బాధపడుతున్న గ్రామాలకు శాశ్వత విముక్తి కల్పిస్తూ మొత్తం 23 లక్షల మందికి తాగునీరు అందిస్తుంది.
* 1996లో ప్రాజెక్టు పనులు మొదలైనప్పటి నుంచి సొరంగాల నిర్మాణం, ఫీడర్ కాలువలు, హెడ్ రెగ్యులేటర్లు, భూసేకరణతో పాటు పునరావాసం వంటి ఎన్నో సంక్లిష్టమైన సవాళ్లు ఎదురయ్యాయి..
* 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలిగొండ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్టుగా భావించి పనులు పరుగులెట్టించింది.టన్నెల్ పనులను రికార్డు సమయంలో పూర్తి చేయడంతో పాటు నిర్వాసిత కుటుంబాల సంక్షేమానికి పెద్ద పీట వేసింది. కేవలం 48 రోజుల వ్యవధిలోనే పునరావాసం కింద నిర్వాసితులకు రూ. 768 కోట్ల భారీ పరిహారాన్ని చెల్లించి ప్రాజెక్టు ప్రారంభానికి మార్గం సుఖమం చేసింది.
* ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రావడం వల్ల రాయలసీమ, ప్రకాశం జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో వ్యవసాయం ఒక చిత్రం పూర్తిగా మారనుంది. సాగునీటి భద్రత పెరగడంతో సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా ఉద్యానవన పంటలు, కమర్షియల్ క్రాఫ్ట్ సాగు వైపు రైతులు మొగ్గు చూపే అవకాశం ఏర్పడుతుంది. 30 సంవత్సరాల సంకల్పం నెరవేరుతుండడం.. దాని వెనుక చంద్రబాబు కృషి ఉందంటూ స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు