Vallabhaneni Vamsi: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు( Vamsi Mohan ) కష్టాలు వెంటాడుతున్నాయి. ఆయన ఇప్పట్లో కేసుల నుంచి బయటపడే అవకాశం కనిపించడం లేదు. గత వంద రోజులుగా ఆయన అనేక కేసుల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతూ వచ్చారు. ఇప్పటివరకు ఆయన పై ఏడు కేసులు నమోదయ్యాయి. ఐదు కేసులకు సంబంధించి బెయిల్ వచ్చింది. మరో కేసులో వాదనలు ముగిసాయి. కోర్టు తీర్పు వెల్లడించనుంది. అయితే ఇంతలోనే ఆయనపై మరో కేసు నమోదు అయింది. అందులో 14 రోజుల రిమాండ్ కూడా విధించింది న్యాయస్థానం. ఇంకోవైపు వల్లభనేని వంశీ మోహన్ ఆరోగ్యం క్షీణిస్తోంది. శ్వాస తీసుకోవడంలో సైతం ఆయన ఇబ్బంది పడుతూ కనిపిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వల్లభనేని వంశీ మోహన్ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. గన్నవరం నియోజకవర్గ విషయంలో జగన్మోహన్ రెడ్డి వేరే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం.
Also Read: ప్రధాని చెంతకు లోకేష్.. చంద్రబాబు నయా ప్లాన్!
* గన్నవరం నుంచి రెండుసార్లు..
గన్నవరం ( Gannavaram)నుంచి రెండుసార్లు గెలిచారు వల్లభనేని వంశీ మోహన్. 2014 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ సిఫారసు మేరకు అప్పట్లో ఆయనకు టికెట్ దక్కినట్టు ప్రచారం జరిగింది. అయితే 2014 నుంచి 2019 మధ్య టిడిపి ఎమ్మెల్యేగా ఆయన కొనసాగారు. 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా రెండోసారి పోటీ చేసి గెలిచారు. గెలిచిన కొద్ది రోజులకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దీంతో ఆయనపై పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు టిడిపిలో చేరారు. 2014లో వైసిపి అభ్యర్థిగా పోటీ చేసిన దుట్టా రామచంద్రరావు పై గెలిచారు వల్లభనేని వంశీ మోహన్. 2024 ఎన్నికల్లో వల్లభనేని వంశీ మోహన్ తో ఇష్టం లేకున్నా దుట్టా రామచంద్రరావుకు పని చేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు నియోజకవర్గ వైసీపీకి అండగా ఉండేందుకు కొత్తగా తనను ఇన్చార్జ్ చేయాలని రామచందర్రావు జగన్మోహన్ రెడ్డి పై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
* వల్లభనేనికి నో ఛాన్స్..
ప్రస్తుతం వల్లభనేని వంశీ పరిస్థితి చూస్తుంటే ఇప్పట్లో ఆయన కేసుల నుంచి బయటపడే అవకాశం లేదు. ఆయన ఆరోగ్యం కూడా పెద్దగా సహకరించదని తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లోనే పోటీ చేయకూడదని వల్లభనేని వంశీ భావించారు. జగన్మోహన్ రెడ్డి ఒత్తిడితోనే అప్పట్లో పోటీ చేశారని ప్రచారం జరిగింది. ఈసారి వల్లభనేని వంశీ మోహన్ ను పక్కన పెట్టి దుట్టా రామచంద్రరావు( Ramachandrao) కుమార్తెను వైయస్సార్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటిస్తారని తెలుస్తోంది. రామచంద్ర రావు కుమార్తెతో పాటు అల్లుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ప్రస్తుతం పార్టీ కార్యకలాపాలను వారే చూస్తున్నారు. అందుకే వల్లభనేని వంశీ మోహన్ స్థానంలో దుట్టా రామచంద్ర రావు కుమార్తెకు ఇన్చార్జి బాధ్యతలు కట్టబెడతారని ప్రచారం సాగుతోంది.
* తెరపైకి ఆమె పేరు..
మరోవైపు మరో మహిళా నేత సుంకర పద్మ( sunkara Padma) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చారు. పిసిసి ఉపాధ్యక్షురాలుగా వ్యవహరించారు. పిసిసి అధ్యక్ష పదవి ఆశించారు. కానీ షర్మిల రూపంలో ఆ అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం షర్మిల నాయకత్వాన్ని విభేదిస్తున్నారు. త్వరలో ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం సాగుతోంది. ఆమెది సొంత నియోజకవర్గం గన్నవరం. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ లోకి తెచ్చి నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు కట్టబెడతారని ప్రచారం జరుగుతోంది. కానీ దుట్టా రామచంద్రరావు సీనియారిటీ, ఆయన కుటుంబం పార్టీ కోసం శ్రమిస్తున్న తీరు.. ఈ పరిణామాలతో వారికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. చూడాలి మరి జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..