AP Caste Census: ఏపీలో ఈనెల 27 నుంచి కుల గణన ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా కుల గణనపై విస్తృతమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. ఏపీ సర్కార్ ఈ ప్రక్రియకు శ్రీకారం చుడుతుండడం విశేషం.పూర్తిగా గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా కుల గణన చేపట్టడానికి ఏపీ సర్కార్ నిర్ణయించింది. రాజకీయ వివాదాలు వస్తాయని భావించి వలంటీర్లను పక్కనపెట్టింది. ఈనెల 27 నుంచి వారం రోజులు పాటు మొబైల్ యాప్ ద్వారా సర్వే నిర్వహించనుంది.
రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ, ప్లానింగ్, సంక్షేమ శాఖ నుంచి ఎంపిక చేసిన సూపర్వైజర్లు ఈ సర్వే ను పర్యవేక్షిస్తారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది.. తం పరిధిలో ఇంటింటికి వెళ్లి కుల గణన చేపడుతారు. మండల స్థాయిలో తహసీల్దారులు, ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు, మండల ప్రత్యేక అధికారుల సైతం పర్యవేక్షించనున్నారు. వివరాల నమోదుకు ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెచ్చారు. ముందుగా వివిధ కుల సంఘాల ప్రతినిధులను పిలిచి కుల గణన గురించి వివరిస్తారు. ప్రతి వ్యక్తి వివరాలను నమోదు చేసినప్పుడు ఈ కేవైసీ తప్పనిసరి చేశారు. అయితే ఎనిమిది సంవత్సరాల లోపు ఉన్నవారికి ఈ కేవైసీ తప్పనిసరి కాదు.
కుటుంబం అందుబాటులో ఉన్నారా? మరణించారా? శాశ్వతంగా వలస వెళ్లారా? అన్న వివరాలను సేకరించినన్నారు. జిల్లా, జిల్లా కోడ్, మండలం/ మునిసిపాలిటీ, గ్రామం, పంచాయితీ / పంచాయతీ కోడ్, వార్డు నెంబర్, ఇంటి నెంబర్, కుటుంబ పెద్ద పేరు, ఆధార్ నెంబర్, కుటుంబ సభ్యుల సంఖ్య, కుటుంబ సభ్యుని పేరు, కుటుంబ పెద్దతో గల సంబంధం, రేషన్ కార్డ్ నెంబర్, కుటుంబం నివాసం ఉంటున్న ఇల్లు గురించి వివరాలు నమోదు చేస్తారు.
ఇక తప్పనిసరిగా ప్రస్తుతం చిరునామా పొందుపరచాల్సి ఉంటుంది. మరుగుదొడ్డి సౌకర్యం ఉందా? లేదా? మంచినీరు/ తాగునీటి సదుపాయం ఉందా? వీధి కుళాయి, బోర్ వెల్, పబ్లిక్ బోర్వెల్, సొంత కుళాయి ఉందా? లేదా? పశు సంపద ఏమైనా కలిగి ఉన్నారా? ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు ఉన్నాయా అని సర్వే చేస్తారు. గ్యాస్ పొయ్యి ఉందా? లేకుంటే కట్టెల పొయ్యితోనే వండుతున్నారా? కుటుంబ సభ్యుల సమగ్ర వివరాలు, వ్యవసాయ భూమి వివరాలు, నివాస స్థలం వివరాలు అందించాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నింటినీ ప్రత్యేక యాప్ లో పొందుపరచనున్నారు. అయితే ఈ కుల గణన సర్వే ఇంటింటికి వెళ్లి జరుపుతారా? అలా చేస్తే సమయం సరిపోతుందా? అన్న అనుమానం అధికారుల్లో ఉంది. ప్రభుత్వం మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా… వివాదాలు తలెత్తకుండా.. సజావుగా పూర్తి చేయాలని ప్రయత్నిస్తుంది. మరి అది ఎంతవరకు సఫలీకృతం అవుతుందో చూడాలి.