Homeఆంధ్రప్రదేశ్‌JanaSena: జనసేనలో ట్రబుల్స్ ఫేస్ చేసే నేత ఏరి?

JanaSena: జనసేనలో ట్రబుల్స్ ఫేస్ చేసే నేత ఏరి?

JanaSena: రాజకీయ పార్టీల సక్సెస్ వెనుక కొంతమంది నేతలు ఉంటారు. అటువంటి వారిని రకరకాలుగా సంబోధిస్తుంటారు. ముఖ్యంగా ట్రబుల్ షూటర్ అని పిలుస్తుంటారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి అమిత్ షా ట్రబుల్ షూటర్ గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చాలామంది ట్రబుల్ షూటర్లు ఉన్నారు. కానీ ఆ పార్టీ ట్రబుల్స్ లో ఉంది. అందుకే ట్రబుల్ షూటర్ లు సైతం ఏం చేయలేకపోతున్నారు. ఏపీ విషయానికి వచ్చేసరికి జగన్ దగ్గర చాలామంది ట్రబుల్ షూటర్లు ఉన్నారు. అందరికంటే మించి సజ్జల వారు సకల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. పైగా ఆ నలుగురు పార్టీకి అండదండలు అందిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సైతం పత్రికాధినేతలు, కీలక నేతలు ట్రబుల్ షూటర్లుగా వ్యవహరిస్తున్నారు. ఒక్క జనసేనకు మాత్రం కర్త, కర్మ, క్రియ పవన్ కళ్యాణే. ఆ పార్టీకి ట్రబుల్ షూటర్ అంటూ ఎవరూ లేకపోవడం లోటే.

పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే పార్టీలో పెద్ద ఎత్తున నేతలు టికెట్లు ఆశించారు. దీంతో అసంతృప్తులు బయటపడ్డాయి. పవన్ కళ్యాణ్ వారిని సముదాయించడానికి సమయాన్ని కేటాయించాల్సి వస్తోంది. ఎన్నికల ప్రచారం సమయంలో అది ఇబ్బందికర పరిణామంగా మారుతుంది. విలువైన సమయాన్ని బుజ్జగింపుల కోసం కేటాయించడం ఇబ్బందికరంగా మారుతోంది. నిన్న మొన్నటి వరకు నాదెండ్ల మనోహర్ పార్టీ వ్యవహారాలను చూసుకునేవారు. కానీ ఆయన తెనాలి అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేస్తున్నారు. పార్టీ వ్యవహారాలను పట్టించుకునే స్థితిలో లేరు. పైగా పోతిన మహేష్ తో పాటు పార్టీని వీడుతున్న చాలామంది నేతలు నాదెండ్ల మనోహర్ పైనే ఆరోపణలు చేస్తున్నారు. దీంతోఆయన ట్రబుల్ షూటర్ అయ్యే అవకాశం లేదు. దీంతో పవన్ కు ఇబ్బందులు తప్పడం లేదు.

వైసీపీలో టిక్కెట్లు దక్కని వారికి సజ్జల అండ్ కో, టిడిపిలో అసంతృప్తులకు లోకేష్ సముదాయిస్తున్నారు. మరి జనసేన విషయానికి వచ్చేసరికి ఎవరు? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కనీసం నాగబాబు అయినా పెద్దదిక్కుగా నిలబడతారని జనసైనికులు ఆశించారు. కానీ ఆయన సైతం యాక్టివ్ కాలేదు. వాస్తవానికి ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని.. ఎన్నికల్లో సమన్వయకర్తగా వ్యవహరిస్తానని చాలా రోజుల కిందట నాగబాబు ప్రకటించారు. దీంతో జనసేనలో ఆయన ట్రబుల్ షూటర్ అవుతారని అంతా భావించారు. కానీ ఎందుకో నాగబాబు వెనుకబడ్డారు. జనసేన ప్రధాన కార్యదర్శిగా అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు. పార్టీని, పార్టీ శ్రేణులను సమన్వయం చేయలేకపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన ను సమన్వయం చేసే నేత ఆ పార్టీకి అవసరం. రేపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన చాలా రకాల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ సమయంలో సమస్యకు పరిష్కార మార్గం చూపించి.. పవన్ కళ్యాణ్ కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయగల నేత తక్షణం అవసరం. లేకుంటే మాత్రం జనసేనకు ఇబ్బందికర పరిణామమే. ఇక ఆలోచించుకోవాల్సింది పవన్ కళ్యాణే.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular