AP Elections 2024: ఏపీలో ఒక సెంటిమెంట్ కొనసాగుతోంది. ఉత్తరాంధ్రలో ఏ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటే.. ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో అత్యధిక స్థానాలను టిడిపి గెలుచుకుంది. ఆ పార్టీ అధికారంలోకి రాగలిగింది. 2019 ఎన్నికల్లో వైసిపి అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో సైతం మెజారిటీ సీట్లు గెలుచుకుంటామని రెండు పార్టీలు భావిస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం కూటమికి అనుకూల పవనాలు వీస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విశాఖ రాజధాని, సంక్షేమ పథకాలే తమకు గట్టి ఎక్కిస్తాయని వైసిపి ఆశతో ఉంది.
ఉత్తరాంధ్రలో మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో 15, విజయనగరంలో 19, శ్రీకాకుళంలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో 34 స్థానాలకు గాను.. వైసిపి 28 చోట్ల విజయం సాధించింది. టిడిపి కేవలం ఆరు స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. విజయనగరం జిల్లాలో అయితే అసలు ఖాతా తెరవలేదు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం వైసీపీకి సీట్లు కట్టడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. కూటమి నేతలు మాత్రం మెజారిటీ సీట్లు దక్కించుకుంటామని చెబుతున్నారు. 2014లో టిడిపికి 25 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. ఇప్పుడు దానిని అధిగమిస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
విశాఖ జిల్లాలో జనసేన తో పొత్తు టిడిపికి కలిసి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. గత ఎన్నికల్లో విశాఖ నగరంలోని నాలుగు నియోజకవర్గాలకు మాత్రమే టిడిపి పరిమితం అయింది. రూరల్ లో ఖాతా తెరవలేదు. ఈసారి మాత్రం 12 నుంచి 13 స్థానాలను కైవసం చేసుకుంటామని కూటమి నేతలు ధీమాతో ఉన్నారు.
విజయనగరం జిల్లాలో గత ఎన్నికల్లో వైసిపి వైట్ వాష్ చేసింది. 9 నియోజకవర్గాలను హస్త గతం చేసుకుంది. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ గట్టి పోటీ ఇస్తోంది. మెజారిటీ స్థానాలను గెలుచుకుంటామని ధీమాతో చెబుతోంది. గతఎన్నికల మాదిరిగా వైసీపీకి అవకాశం ఇవ్వమని కూడా నేతలు తేల్చి చెబుతున్నారు. ఐదు నుంచి 6 స్థానాలను గెలుచుకుంటామని సవాల్ చేస్తున్నారు.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పదికి పది నియోజకవర్గాలను గెలిచి తీరుతామని కూటమి నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకే టిడిపి పరిమితం అయ్యింది. ఈసారి మాత్రం పదికి పది గెలుస్తామని.. ఒకటి రెండు సీట్లు పై అనుమానం ఉందని.. కానీ ప్రభుత్వ వ్యతిరేకత, పోలింగ్ శాతం పెరగడంతో అధిగమిస్తామని చెబుతున్నారు. మొత్తానికైతే కూటమి నేతల్లో ఒక రకమైన ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. అధికార పార్టీలో మాత్రం ఒక రకమైన నైరాశ్యం అలుముకున్నట్లు తెలుస్తోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More