Cambodia
Cambodia: కంబోడియాకు చెందిన కొందరు భారతీయ ఏజెంట్లు నిర్వహిస్తున్న మానవ అక్రమ రవాణా గుట్టను విశాఖ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసును తవ్వేకొద్ది అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కంబోడియాలో దాడిచేసి సైబర్ మోసాలకు పాల్పడుతన్న వైజాగ్ ఇతర ప్రాంతాలకు చెందిన వందలాది మంది తెలుగు యువకులు తమను బందీగా ఉంచుకున్న కంబోడియా వాసులపై తిరుగుబాటు చేసినట్లు గుర్తించారు.
సైబర్ నేరాలకు కేంద్రంగా..
కంబోడియా సైబర్ నేరాలకు కేంద్రంగా ఉంది. కంబోడియాలోని బిన్బీ, కాంపైండ్, సిహనౌక్ విలేలో ఉద్యోగాల పేరుతో అనేక మంది భారతీయులను అక్కడ ఏజెంట్లు తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లాక వారిని నిర్బంధించి సైబర్ మోసాలపై శిక్షణ ఇస్తున్నారు. నేరాలు చేయిస్తున్నారు. ఈక్రమంలో కొందరు తమను బందించిన కంబోడియన్లపై దాడిచేసి ఈ విషయాలను విశాఖ సిటీ పోలీసులకు వాట్సాప్ కాల్ చేసి చెప్పారు. అక్కడి పరిస్థితులకు సంబంధించిన వీడియోలను కూడా పంపించారు. అప్రమత్తమైన పోలీసులు కంబోడియాకు చెందిన కొంతమంది భారతీయ ఏజెంట్లు నిర్వహిస్తున్న మానవ అక్రమరవాణా రాకెట్ను గుర్తించారు. నగరానికి చెందిన ముగ్గురు ఏజెంట్లు చుక్కా రాజేశ్, సబ్వరపు కొండలరావు, మన్నెన జ్ఞానేశ్వర్ను అరెస్టు చేశారు.
బందీగా 300 మంది..
కంబోడియాలోని భారతీయులు పంపిన వీడియోల ఆధారంగా 300 మందికిపైగా భారతీయులు ప్రస్తుతం కంబోడియాలో బందీగా ఉన్నట్లు విశాఖ పోలీస్ చీఫ్ డాక్టర్ ఎ.రవిశంకర్ తెలిపారు. కంబోడియాలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చి ఏజెంట్లు వీరిని తీసుకెళ్లినట్లు విచారణలో గుర్తించారు. ఇలా వెళ్లిన యువకులను ఎరవేసి ఈ ముఠా భారత్లో సైబర్ క్రైమ్లకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.
అనేక మోసాలు..
ఫెడెక్స్ స్కామ్లు, స్టాక్ మార్కెట్ మోసాలు, టాస్క గేమ్ మోసాలు ఇలా అనేక సైబర్ మోసాలు నిర్వహించడానికి భారత యువతకు శిక్షన ఇచ్చినట్లు నిర్ధారించారు. శిక్షణ తర్వాత వారితోనే సైబర్ నేరాలు చేయిస్తున్నారని వైజాగ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన ఇన్స్పెక్టర్ భవానిప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ నుంచి 5 వేల మంది సైబర్ మోసాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. మోసపూరితంగా తమతో నేరాలు చేయిస్తున్న కంపెనీలపై తాజాగా వారు తిరుగుబాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కుంభకోణం నుంచి బయటపడాలని నిర్ణయించుకుని ఆందోళన చేసినట్లు వెల్లడించారు.
జైల్లో భారతీయులు..
తిరుగుబాటు చేసిన చాలా మంది భారతీయులను అక్కడి పోలీసులు జైల్లో పెట్టినట్లు వైజాగ్ పోలీసులు తెలిపారు. వారిని విడిపించి సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను సంప్రదించారు. సైబర్క్రైమ్, మానవ అక్రమ రవాణా మొత్తాన్ని వెలికి తీసేందుకు ఏడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More