Thammineni Sitaram: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శాసనసభ స్పీకర్ గా తమ్మినేని సీతారాం కొనసాగారు. ఈయన ఇప్పుడు ఏపీ రాజకీయాలలో ప్రధానంగా కనిపిస్తున్నారు. ఈయన పేరు ప్రధానంగా వినిపిస్తోంది. దీనికి కారణం భూకబ్జా. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం కీలక విషయాలను బయటపెట్టింది. దీంతో సీతారాం కు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది.
వైసీపీ నేత.. శాసనసభ మాజీ స్పీకర్ సీతారాం.. ఆయన కుటుంబ సభ్యులు ఏకంగా నాలుగు కోట్ల విలువైన భూమిని దక్కించుకోవడానికి కుట్రలు చేశారని అభియోగాలు నమోదయ్యాయి. భూమికి సంబంధించిన యజమాని బతికి ఉండగానే చనిపోయినట్టు నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలను సృష్టించారు . ఆ భూమికి యజమాని కూతురిగా ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ మహిళను చూపించారు. ఆ భూమిని సీతారాం తన కుమారుడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో సీతారాం.. ఆయన కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్.. సీతారాం సతీమణి వాణి పై పోలీసులు కేసులు నమోదు చేశారు.
చాపురం పంచాయతీలోని బలగా పరిధిలో అండవరపు గోవిందరాజులు అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడు తన ఏడుగురు సోదరులతో కలిసి 1988లో సత్యసాయి నగర్ ప్రాంతంలో లేఅవుట్ వేశాడు. సర్వే నెంబర్ 35/13 లో 84, 85, 86 ప్లాట్లను కట్ట కనక లింగేశ్వరరావు అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. ఇతడు తన కుటుంబంతో కలిసి హైదరాబాదులో స్థిరపడ్డాడు. అయితే ఖాళీగా ఉన్న ఈ స్థలం మీద కొందరు కన్ను వేశారు. కనక లింగేశ్వర రావు చనిపోయినట్టు శ్రీకాకుళం పురపాలకంలో నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు రూపొందించారు. అడబాల రజిని అనే మహిళను అందవరపు రజనీగా చూపించారు. గోవిందరాజులు ఏకైక వారసురాలుగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తహసిల్దార్ ఇచ్చినట్టు నకిలీది రూపొందించారు. నకిలీ పత్రాలు రూపొందించారు.. ఆ మూడు ప్లాట్లను ఖాళీ స్థలంగా ఉందని నమ్మించారు. వైసీపీ అధికారంలో ఉన్న 2023 ఏప్రిల్ 13న 570 గజాలు.. అదే సంవత్సరం ఆగస్టు 23న 352 గజాలు.. మొత్తంగా 922 గజాల స్థలాన్ని సీతారాం తన కుమారుడి పేరు మీద రెండు డాక్యుమెంట్లుగా రిజిస్ట్రేషన్ చేయించారు.
ఈ స్థలంలో సీతారాం కుటుంబ సభ్యులు గోడ నిర్మిస్తుండగా కనక లింగేశ్వర రావు కుమారుడు జయ కిషోర్ తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. గోడ నిర్మాణాన్ని అడ్డుకున్నాడు. వెంటనే న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో జయ కిషోర్ తమ్మినేని సీతారాం మీద ఫిర్యాదు చేశాడు. దీంతో శ్రీకాకుళం జిల్లా పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అయితే ఇక్కడే సీతారాం మళ్లీ గేమ్ మొదలుపెట్టారు. అది సివిల్ కేసు కాబట్టి శ్రీకాకుళం పోలీసులు ఇన్వాల్వ్ కావద్దంటూ హైకోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చుకున్నాడు. అయితే బతికి ఉన్న వారిని చంపడం.. ఇతర వ్యవహారాల మీద పోలీసులు దృష్టి సారించి.. సీతారాం మీద కేసులు నమోదు చేశారు. మరి ఈ విషయంలో తమ్మినేని సీతారాం మీద ఏపీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.
