Thammineni Seetharam Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన అధికార దర్పాన్ని ఉపయోగించి.. నకిలీ పత్రాలతో కుమారుడి పేరుతో నాలుగు కోట్ల రూపాయల విలువైన భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని హైకోర్టుకు స్పష్టం చేశారు బాధితుల తరుపు న్యాయవాదులతో పాటు ప్రభుత్వ న్యాయవాదులు. నకిలీ పత్రాల తయారీ, ఫోర్జరీ, అక్రమ రిజిస్ట్రేషన్ అన్నింటిలోనూ తమ్మినేని సీతారాం వ్యూహకర్తగా న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో ఆయన కుటుంబ సభ్యులకి కీలకపాత్ర అని తేల్చారు. ఇందుకు సంబంధించి సాక్షులుగా ఉన్న వారి సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులే వాంగ్మూలం ఇచ్చారని ఆధారాలు సమర్పించారు. అందుకే తమ్మినేని సీతారాం తో పాటు కుటుంబ సభ్యులకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దని వాదనలు వినిపించారు. హైకోర్టులో వాదనలు కొనసాగగా.. ఈనెల 27 వరకు తీర్పును రిజర్వ్ చేశారు న్యాయమూర్తి.
* ఇలా చేశారు..
శ్రీకాకుళం నగరంలో నాలుగు కోట్ల రూపాయల విలువైన భూమికి సంబంధించిన వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆ భూమికి సంబంధించి అసలు యజమాని బతికి ఉండగా.. ఆయన చనిపోయినట్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి.. నకిలీ వారసులను సృష్టించి.. వారు భూమిని విక్రయించినట్లు చెప్పి తమ్మినేని సీతారాం కుమారుడు పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ భూమి ఒక రిజిస్ట్రేషన్ కార్యాలయ పరిధిలో ఉంటే.. మరో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈ ఈ రిజిస్ట్రేషన్ అక్రమంగా జరిగినట్లు కోర్టు ముందు ఉంచారు. అయితే తమ్మినేని సీతారాం తరపు న్యాయవాదులు సైతం.. ఆ నకిలీ పత్రాలతో సంబంధం లేదని.. ఆ భూమి కొనుగోలుకు బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకున్న విషయాన్ని న్యాయస్థానంలో ప్రస్తావించారు. ఆ రిజిస్ట్రేషన్ తో వారికి ఎటువంటి సంబంధాలు లేవని.. తప్పుడు ధ్రువీకరణ పత్రాల తయారు చేసే అంశంలో తమ్మినేని ఫ్యామిలీకి కనీసం భాగస్వామ్యం లేదని చెప్పుకొచ్చారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. సోమవారం ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు.
* ఉచ్చు బిగిసినట్టే..
అయితే పోలీసులు తమకు తాముగా విచారణ చేపట్టలేదు. తాను బతికుండగానే చనిపోయినట్లు నకిలీ పత్రాలు సృష్టించి.. నాలుగు కోట్ల రూపాయల విలువైన తన స్థలాన్ని తప్పుడు మార్గంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటూ బాధితుల ఫిర్యాదుతో శ్రీకాకుళం గ్రామీణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. పోలీస్ విచారణలో ఈ నకిలీ ధ్రువపత్రాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇందులో సాక్షులుగా తమ్మినేని విద్యా సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఉన్నారు. వారిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నకిలీ రిజిస్ట్రేషన్ వెనుక కర్త కర్మ క్రియ తమ్మినేని అని తేలిపోయింది. అయితే ఇంతకుముందే తనపై ఉన్న కేసులను కొట్టివేయాలని కోరుతూ తమ్మినేని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ న్యాయస్థానం ఆ పిటిషన్ ను కొట్టివేసింది. ప్రస్తుతం తమ్మినేని కుటుంబంతో సహా పరారీలో ఉన్నారు. ముందస్తు బెయిల్ పొందే ప్రయత్నంలో ఉన్నట్లు అర్థమవుతోంది. అయితే అంతకంటే ముందే ప్రభుత్వం తరపు న్యాయవాది పూర్తి ఆధారాలతో సహా న్యాయస్థానం ముందు ఉంచారు. మరి ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి.







