Pithapuram: ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం ఏపీలో హాట్ టాపిక్. అక్కడ ఏ చిన్న పాటి ఘటన జరిగినా సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తుండటమే కారణం. పిఠాపురం స్థానానికి జనసేనకు కేటాయించడం.. తానే స్వయంగా పోటీ చేస్తున్నట్లు పవన్ ప్రకటించడంతో రచ్చ రచ్చ చోటుచేసుకుంది. వర్మ అనుచరులైతే ఏకంగా టిడిపి కార్యాలయాన్ని తగలబెట్టేశారు. పవన్ ను నాన్ లోకల్ గా అభివర్ణించారు. ఆయన ఎలా గెలుస్తాడో చూస్తామంటూ సవాల్ చేశారు. వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేసి మరోసారి సత్తా చాటుతారని చెప్పుకొచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా పవన్ కు వ్యతిరేకంగా భారీ ఫ్లెక్సీల ఉద్యమాన్ని కూడా చేపట్టారు. అయితే అదే వర్మ చంద్రబాబు వద్దకు వెళ్లిన తర్వాత సైలెంట్ అయ్యారు. చాలా కూల్ అయ్యారు. అక్కడ నుంచి నేరుగా పవన్ కళ్యాణ్ ను కలిసి.. ఆయన గెలుపు కోసం కృషి చేస్తానని ప్రకటించారు.
అయితే చంద్రబాబుతో వర్మ ఒంటరిగా మాట్లాడడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2014లో వివిధ సమీకరణలతో చంద్రబాబు వర్మకు టికెట్ ఇవ్వలేదు. దీంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి 47 వేల ఓట్ల మెజారిటీతో వర్మ గెలుపొందారు. మరోసారి వర్మ అలానే చేస్తారని అంతా భావించారు. కానీ అక్కడ పోటీ చేస్తున్నది పవన్ కళ్యాణ్. అందుకే చంద్రబాబు కూల్ గా డీల్ చేశారు. వర్మను పిలిపించుకొని మాట్లాడారు. ఎమ్మెల్సీ ఆఫర్ తో పాటు మంత్రివర్గంలోకి తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇండిపెండెంట్ గా బరిలో దిగి చేతులు కాల్చుకోవడం కంటే.. సులువు మార్గంలో ఎమ్మెల్సీ గా మారి.. మంత్రి పదవి చేజిక్కించుకోవచ్చని వర్మ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. పవన్ కు సహకరించడానికి డిసైడ్ అయ్యారు.
చంద్రబాబును కలిసిన తర్వాత రిలాక్స్ అయిన వర్మ.. నేరుగా పవన్ ను కలిశారు. పవన్ సైతం వర్మకు ఆత్మీయంగా స్వాగతం పలికారు. భుజంపై చేయి వేసి మాట్లాడారు. నాలుగు రోజుల్లో పిఠాపురం వస్తానని.. పార్టీ శ్రేణులతో సమావేశం ఏర్పాటు చేయాలని అదే వర్మను పవన్ పురమాయించారు. దీంతో వర్మ నేరుగా టిడిపి శ్రేణులతో మాట్లాడారు. పవన్ గెలుపునకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. దీంతో పిఠాపురం టిడిపిలో ఎగసిన ఆగ్రహ జ్వాల క్రమేపీ చల్లబడుతోంది. అయితే వర్మ మాత్రం గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచారు. వర్మ స్టేట్మెంట్స్, కదలికలతో రాజకీయాలు వేడెక్కాయి. కానీ వాటన్నింటినీ చెక్ చెబుతూ వర్మను పవన్ కళ్యాణ్ చెంతకు చేర్చి.. చంద్రబాబు కథను సుఖాంతం చేశారు.