Posani Krishna Murali : వలంటీర్ల వ్యవస్థపై పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా రచ్చకు దారితీశాయి. ఒక వైపు వలంటీర్లు, మరోవైపు వైసీపీ నేతలు ఆందోళనలకు దిగుతున్నారు. పవన్ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు. తాజాగా ఈ వివాదం ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి స్పందించారు. పవన్ పై విమర్శలు చేస్తూనే.. పవన్ వెనుక జరుగుతున్నరాజకీయ చదరంగం గురించి వెల్లడించారు. చిరంజీవి ప్రజారాజ్యం నుంచి పవన్ జనసేన వరకూ టీడీపీ నేతలు, ఎల్లో మీడియా ఆడుతున్న డ్రామాలను బయటపెట్టారు. ఇప్పుడు ఈ వీడియోలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
2014 ఎన్నికల్లో పవన్ గాజువాకతో పాటు భీమవరంలో పోటీచేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు చోట్ల ఓటమే ఎదురైంది. త్రిముఖ పోరులో రెండుచోట్ల వైసీపీ అభ్యర్థులే గెలిచారు. పవన్ రెండో స్థానంలో నిలిచారు. అయితే ఇది ఒక విధంగా దారుణ పరాజయంగా చెప్పాలి. రెండుచోట్ల ఓటమి ఎదురైతే ఒక పార్టీ అధ్యక్షుడిగా రాజకీయాల నుంచి నిష్క్రిమిస్తారు. కానీ పవన్ అలా చేయలేదు. పార్టీని నిలబెట్టారు. మంచి పొజిషన్ లో ఉంచారు. అయితే నాడు భీమవరంలో పవన్ ఓటమికి గల కారణాలను పోసాని విశ్లేషించారు. రూ.15 కోట్లు ఖర్చుపెట్టి పవన్ టీడీపీ నాయకులే ఓడించారని గుర్తుచేశారు. ఈ విషయంలో విచారణ పెడితే పవన్ కు అసలు విషయాలు తెలుస్తాయని చెప్పారు.
పనిలో పనిగా ప్రజారాజ్యం సమయంలో చిరంజీవికి ఎదురైన పరిణామాల గురించి సైతం పోసాని సంచలన నిజాలు బయటపెట్టారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. అయితే అప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రెండోసారి విజయం సాధించాలన్న కసితో ఉంది. అప్పటికే టీడీపీ అధికారానికి దూరమై ఐదేళ్లు అవుతోంది. పీఆర్పీతో తమ ఓటింగ్ కు గండిపడుతుందన్న భయం చంద్రబాబులో ఉంది. అందుకే రామోజీరావు చిరంజీవితో చర్చించారు. టీడీపీతో కలిసి నడవాలని సలహా ఇచ్చారు. దీనికి చిరంజీవి ఒప్పుకోకపోవడంతో ఎల్లో మీడియాలో కథనాలతో పాటు కుటుంబాలు, ఇంట్లో ఆడవాళ్లపై సైతం ప్రచారం చేశారు. అప్పట్లో చిరంజీవి తనతో విషయాలన్ని చెప్పి బాధపడినట్టు పోసాని తాజాగా చెప్పుకొచ్చారు.
రాష్ట్రం తమ కబంధ హస్తాల్లో ఉండాలన్నదే కమ్మ ప్రముఖుల ధ్యేయమని పోసాని విమర్శించారు. చంద్రబాబు, రామోజీరావు, రాధాక్రిష్ణల ద్వయంలో పవన్ చిక్కుకున్నారని ఆరోపించారు. పవన్ ను ముందుపెట్టి వారు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అందుకే బాధ్యతాయుతమైన వలంటీరు వ్యవస్థపై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని మసులుకోవాలన్నారు. కమ్మ ప్రముఖుల రాజకీయాల నుంచి బయటకు రావాలన్నారు.